ఆంధ్ర ప్రదేశ్ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త!

ABN , First Publish Date - 2021-12-28T23:28:58+05:30 IST

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ)లో భాగంగా

ఆంధ్ర ప్రదేశ్ సహా 5 రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త!

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ)లో భాగంగా 5 రాష్ట్రాల్లో 1.07 లక్షల ఇళ్ళ నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 23న  ఆమోదించింది. ఈ ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కోరింది. ఈ వివరాలను ప్రభుత్వం డిసెంబరు 24న విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 


సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్ఎంసీ) సమావేశం డిసెంబరు 23 గురువారం జరిగింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పీఎంఏవై(యూ) క్రింద 1.07 లక్షల గృహాల నిర్మాణ ప్రతిపాదనలను ఈ సమావేశం ఆమోదించింది. ఈ ఇళ్ళను ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్‌లలో నిర్మిస్తారు. 


ఇతర రాష్ట్రాల్లో పీఎంఏవై(యూ) అమలును దుర్గా శంకర్ మిశ్రా ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 1.14 కోట్ల ఇళ్ళను మంజూరు చేశారు. వీటిలో 91 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. 53 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది, వాటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ పథకం క్రింద పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.7.52 లక్షల కోట్లు కాగా, దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1.85 లక్షల కోట్లు. ఇప్పటి వరకు రూ.1.14 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 


Updated Date - 2021-12-28T23:28:58+05:30 IST