మరణాల రేటు 1% మించొద్దు
ABN , First Publish Date - 2020-07-05T07:15:56+05:30 IST
కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎ్సలను
- రాష్ట్రాల సీఎస్లకు రాజీవ్ గౌబ ఆదేశాలు
- తెలంగాణలో టెస్ట్లు పెంచాం: సీఎస్ సోమేశ్
అమరావతి/హైదరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల సీఎ్సలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు.కొవిడ్ నియంత్రణ చర్యలు, వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై శనివారం ఆయన రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ లక్షణాలున్నవారికి వీలైనంత ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయాలని చెప్పారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని, కేంద్ర హోంశాఖ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి రాజీవ్ గౌబ ఆరా తీశారు. తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించిన అనంతరం కరోనా పరీక్షలు, టెస్టింగ్ సదుపాయాలను పెంచామని సీఎస్ సోమేశ్ కుమార్.. రాజీవ్ గౌబకు తెలిపారు.