లాభాల్లో ఉన్నవాటినీ ప్రైవేటీకరిస్తారా?
ABN , First Publish Date - 2022-08-10T06:29:56+05:30 IST
దేశంలో నష్టాల్లో ఉన్న బ్యాంకులతోపాటు లాభాల్లో నడుస్తున్న బ్యాంకులను కూడా ప్రైవేటీకరించేందుకు కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని అఖిల భా రత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం విమర్శించారు.
సామాన్యులకు లేని రాయితీలు కార్పొరేట్లకా?
ఇద్దరి కోసం వ్యవస్థను నాశనం చేస్తున్నారు
ఆలిండియా బ్యాంకు ఉద్యోగుల భేటీలో వక్తలు
విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : దేశంలో నష్టాల్లో ఉన్న బ్యాంకులతోపాటు లాభాల్లో నడుస్తున్న బ్యాంకులను కూడా ప్రైవేటీకరించేందుకు కేంద్రప్రభుత్వం కుట్రలు పన్నుతోందని అఖిల భా రత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం విమర్శించారు. బ్యాంకింగ్ వ్యవస్థను ఏం చేయదలచుకున్నారో స్పష్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ మూడో వార్షికోత్సవ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ లాభా ల్లో ఉన్న బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తారు? దేశంలో ఉన్న ఇద్దరి కోసం బ్యాంకులను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం అడుగులు వేస్తోంది. లక్షల కోట్లు రుణాలు తీసుకుని డిఫాల్టర్లుగా ఉన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. గ్యాస్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ సాధారణ, మధ్యతరగతి ప్రజానీకంపై భారాన్ని మోపు తూ... కార్పొరేట్లకు మాత్రం మోదీ సర్కారు ఎక్కడా లేని రాయితీలు ఇస్తోంది. భారీ మొత్తంలో రుణాలు తీసుకుని ఎగవేసిన కార్పొరేట్ల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా విడుదల చేయాలి. ఒక వ్యాపారి రుణం తీసుకుని ఎన్పీఏ జాబితాలోకి వెళ్లిన తర్వాత 50శాతాన్ని ప్రొవిజన్ చేయడం వల్ల బ్యాంకులు నష్టపోతున్నాయి. దీనికి భిన్నంగా ఉద్యోగులు పనిచేయకపోవడంతోనే నష్టం వచ్చిందన్నట్టు కేంద్రం భూతద్దంలో చూపిస్తోంది. బ్యాంకుల్లో పనిభారాన్ని తగ్గించడానికి అన్ని స్థాయు ల్లో ఖాళీలను భర్తీ చేయాలి’’ అని వెంకటాచలం డిమాండ్ చేశారు. ఏఐబీఈఏ పటిష్టంగా ఉండడం వల్లే బ్యాంకుల విలీనాలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యకలాపాలు జరుగుతున్నాయని యూనియన్ బ్యాంక్ సీజీఎం వీ బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఏఐబీఈఏ కార్యదర్శి బీఎస్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి ఎన్.శంకర్, ఎఫ్జీఎం ఆఫీసు జీఎం కేఎ్సడీఎస్ వరప్రసాద్, బ్యాం కు ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు టీ రవీంద్రనాథ్, కోర్కమిటీ సభ్యుడు విన్సెంట్ డి సౌజా, ఏపీయూబీఈఏ అధ్యక్షుడు కాలే శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీ ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీయూబీఈఏ చైర్మన్గా పీ విజయ్భాస్కర్, అధ్యక్షుడిగా కాలే శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. కోశాధికారిగా పీ సుమన్, సంయుక్త కోశాధికారిగా జీ వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.