శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలు
ABN , First Publish Date - 2022-05-23T07:30:59+05:30 IST
తిరుమలలో వారాంతపు భక్తుల రద్దీ తగ్గడం లేదు. శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది.
తిరుమల, మే 22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో వారాంతపు భక్తుల రద్దీ తగ్గడం లేదు. శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది. కొండకు భక్తుల రాక పెరిగిన నేపథ్యంలో టీటీడీ అధికారులు ఆలయంలో మూడు లైన్ల ద్వారా భక్తులకు వేగంగా దర్శనం కల్పిస్తున్నారు. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్కు మాత్రమే పరిమితం చేయడంతో అదనంగా సామాన్య భక్తులకు సమయం కలిసివచ్చింది. శనివారం సాయంత్రం రాంభగీచ అతిథిగృహం వరకు ఉన్న సర్వదర్శనం క్యూలైన్ ఆదివారం సాయంత్రానికి ఎస్ఎంసీ వరకు తగ్గింది. కంపార్టుమెంట్లలో, క్యూలైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో శనివారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు 83,739 మంది భక్తులకు దర్శనం కల్పించినట్లు టీటీడీ పేర్కొంది. హుండీ ద్వారా రూ.4.20 కోట్ల ఆదాయం లభించగా, 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపింది. అన్నప్రసాద విభాగం భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందజేస్తోంది. సోమవారం మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి.