2 నెలలైనా యూనిఫామ్స్‌ లేవు.. పాత దుస్తులతోనే పంద్రాగస్టుకు!

ABN , First Publish Date - 2022-08-15T20:01:40+05:30 IST

ప్రభుత్వం ఒకవైపు 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల (Independence Diamond Jubilee)ను ఘనంగా నిర్వహిస్తూ పాఠశాలల విద్యార్థులను అందులో భాగస్వాములను చేస్తోంది. కానీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఏకరూప

2 నెలలైనా యూనిఫామ్స్‌ లేవు.. పాత దుస్తులతోనే పంద్రాగస్టుకు!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందని ఏకరూప దుస్తులు

పాత దుస్తులతోనే పంద్రాగస్టుకు విద్యార్థులు

బడులు ప్రారంభమై రెండు నెలలైనా పంపిణీ ఊసేలేదు

జిల్లాలో  ఏడాదిగా జాడలేని యూనిఫామ్స్‌


నిజామాబాద్‌ అర్బన్‌, ఆగస్టు 14: ప్రభుత్వం ఒకవైపు 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల (Independence Diamond Jubilee)ను ఘనంగా నిర్వహిస్తూ పాఠశాలల విద్యార్థులను అందులో భాగస్వాములను చేస్తోంది. కానీ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఏకరూప దుస్తులు మాత్రం ఇంకా పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు పాత యూనిఫాంలు(Uniforms), రంగుల దుస్తులతో వజ్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. కనీసం 15 ఆగస్టు స్వాతంత్య్ర వేడుకల్లోనైనా కొత్త యూనిఫాంలతో హాజరుకావాలనుకున్న విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1234 ప్రభుత్వ పాఠశాలలు, 50కి పైగా వివిధ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో యూనిఫాంలు అందలేదు. జిల్లాలో లక్షా 32వేల 239 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉండగా వీరికి ప్రతి యేడాది రండు జతల ఏకరూప దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తారు. జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభంకాగా ఇప్పటికీ విద్యాసంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడిచినా విద్యార్థులకు ఇంకా యూనిఫాంలు అందలేదు. జిల్లాలో 29 మండలాలు ఉండగా ఇప్పటికీ కేవలం 7 మండలాల విద్యార్థుల యూనిఫాంలు పంపిణీ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా 22 మండలాల విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. వజ్రోత్సవాల వేడుకలను ఒకవైపు ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల యూనిఫాంల విషయంలో మాత్రం శ్రద్ధపెట్టడంలేదు. అధికారుల అలసత్వం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు పాత యూనిఫాంలతోనే పంద్రాగస్టు వేడుకలకు హాజరుకావాల్సిన పరిస్థితి.


70 శాతం మెప్మాకు, 30శాతం టైలర్స్‌కు

జిల్లాలో 1234 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి యేడాది 2 యూనిఫాంల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. ఈ యేడాది కూడా లక్షా 32వే ల 239 మంది విద్యార్థుల కోసం ఇప్పటికే జిల్లాకు యూనిఫాంలకు సంబంటధించిన క్లాత్‌ వచ్చింది. 70 శాతం యూనిఫాంలు కుట్టే బాధ్యత మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు, 30శాతం యూనిఫాంల బాధ్యత స్థానిక టైలర్స్‌కు ఇచ్చారు. మొదటి జతకు సంబంధించి 3 మండలాలకు ఇంకా టెస్కొ నుంచి క్లాత్‌ రాకపొగా 2వ జతకు సంబంధించిన 9 మండలాలకు క్లాత్‌  రాలేదు. ఈ నెల 15లోగా విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా మెప్మా, స్థానిక టేలర్‌లతో ఒప్పందం చేసుకున్న ఇంకా దుస్తులు అందని పరిస్థితి ఉంది.


రెండేళ్లుగా పాత యూనిఫాంలే

కరోనా కారణంగా 2020 మార్చి నుంచి విద్యాసంస్థలు అంతంతమాత్రంగానే కొనసాగగా 2021 సెప్టెంబరులో విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాయి. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనిఫాంలను ప్రభుత్వం పంపిణీ చేయలేదు. కరోనా కారణంగా పూర్తిస్థాయిలో పాఠశాలలు నడవకపోవడంతో గత యేడాది విద్యాశాఖ యూనిఫాంలకు ఆర్డర్‌ ఇవ్వలేదు. 2020లో విద్యార్థులకు పంపిణీ చేసిన యూనిఫాంలతోనే విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. కొందరి విద్యార్థుల యూనిఫాంలు బాగానే ఉండగా అధిక శాతం విద్యార్థుల యూనిఫాంలు పూర్తిగా పాడైపోయాయి. చిరిగిన యూనిఫాంతోనే విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు.


పంపిణీలో ఎప్పుడు లేటే? 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తుల విషయంలో విద్యాశాఖ ఎప్పుడు నిర్లక్ష్యం వహిస్తుంది. పాఠశాలలు ప్రారంభం అయిన వారం రోజుల్లో యూనిఫాంలు పంపిణీ చేసేలా ముందస్తు ప్రణాళికతో వెళ్లాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న ఇప్పటికీ పూర్తిస్థాయి క్లాత్‌జిల్లాకు రాలేదు. పాఠ్యపుస్తకాలు సైతం ఇప్పటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందకపోగా యూనిఫాంల విషయంలోనూ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారుతుంది.


వారం రోజుల్లో పంపిణీకి ఏర్పాట్లు..

- దుర్గాప్రసాద్‌ (డీఈవో)

జిల్లాలో ఇప్పటికీ 60 శాతం యూనిఫాంల తయారీ పూర్తయింది. మరో వారం రోజుల్లో యూనిఫాంల తయారీ పూర్తవుతుంది. యూనిఫాంల తయారీ పూర్తికాగానే పూర్తిస్థాయిలో విద్యార్థులకు పంపిణీ చేస్తాం. ఇప్పటికీ ఏడు మండలాల్లో యూనిఫాంలు పంపిణీ చేశాం.

Updated Date - 2022-08-15T20:01:40+05:30 IST