అప్రకటిత విద్యుత్ కోత.. జనానికి ఉక్కపోత!
ABN , First Publish Date - 2022-05-23T06:12:29+05:30 IST
అప్రకటిత విద్యుత్ కోతలు మండలంలోని పలు గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురుచేస్తున్నాయి. మండల కేంద్రం గొలుగొండలో ఏర్పాటైన ఈ సబ్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు, గృహ వినియోగదారులు, రైస్ మిల్లర్లు వాపోతున్నారు.
ఇష్టారాజ్యంగా నిలిపి వేస్తున్న సిబ్బంది
రైతులు, మిల్లర్లు, గృహ వినియోగదారులు గగ్గోలు
ఎండలు మండుతుండడంతో అంతా ఉక్కిరిబిక్కిరి
గొలుగొండ, మే 22 : అప్రకటిత విద్యుత్ కోతలు మండలంలోని పలు గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురుచేస్తున్నాయి. మండల కేంద్రం గొలుగొండలో ఏర్పాటైన ఈ సబ్ స్టేషన్ పరిధిలో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు, గృహ వినియోగదారులు, రైస్ మిల్లర్లు వాపోతున్నారు. ప్రస్తుతం రైతులకు, రైస్ మిల్లర్లకు తొమ్మిది గంటల సమయం పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. కానీ రోజులో రెండు నుంచి మూడు గంటలపాటు మాత్రమే సరఫరా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తొమ్మిది గంటల పాటు విధిగా విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అసలే వేసవి కాలం కావడంతో ఎండలు మండుతున్నాయని, ఫ్యాన్లు తిరుగుతున్నా ఇళ్లలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మరో రెండు మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం కానుందని, అప్పుడు ఎండల తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిందిగా అంతా కోరుతున్నారు.