చెరువులా అండర్‌పాస్‌

ABN , First Publish Date - 2021-10-22T05:44:54+05:30 IST

జిల్లా కేంద్రంలో డంప్‌యార్డుకు వెళ్లే మార్గంలో నిర్మించిన అండర్‌పాస్‌ బ్రిడ్జి చెరువును తలపిస్తున్నది.

చెరువులా అండర్‌పాస్‌
వర్షపు నీటితో నిండిపోయిన డంప్‌యార్డుకు వెళ్లే అండర్‌పాస్‌ బ్రిడ్జి

వర్షపు నీటితో నిండిన రోడ్డు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు శూన్యం

మెదక్‌లో డంప్‌యార్డుకు వెళ్లేందుకు తిప్పలు పడుతున్న మున్సిపల్‌ సిబ్బంది

మెదక్‌ మున్సిపాలిటీ, అక్టోబరు 21: జిల్లా కేంద్రంలో డంప్‌యార్డుకు వెళ్లే మార్గంలో నిర్మించిన అండర్‌పాస్‌ బ్రిడ్జి చెరువును తలపిస్తున్నది. జిల్లా కేంద్రానికి రైల్వేలైన్‌ మంజూరవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేసినా.. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపల్‌ శానిటరీ సిబ్బంది మాత్రం ప్రతీరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. డంప్‌యార్డుకు వెళ్లేందుకు ప్రత్యేకంగా సర్వీస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టి రైల్వే లైన్‌ కింద అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించారు. కానీ ఇప్పటి వరకు అది ఉపయోగంలోకి రాలేదు. మరోవైపు అండర్‌పాస్‌ నుంచి నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తున్నది. డంప్‌యార్డుకు వెళ్లేరోడ్డు అధ్వానంగా ఉండటం, అండర్‌పాస్‌ ఉపయోగంలోకి రాకపోవడంతో పారిశుధ్య వాహనాలు సర్వీస్‌ రోడ్డు నుంచి రైల్వే పట్టాలపై ప్రయాణిస్తూ ప్రమాదకరంగా డంప్‌యార్డుకు చేరుకుంటున్నాయి. ఈ మార్గంలో అండర్‌పాస్‌ వద్ద రెండడుగుల ఎత్తులో నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ మార్గంలో వాహనాలను నడపడానికి మున్సిపల్‌ సిబ్బంది జంకుతున్నారు. గతంలో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు అండర్‌పా్‌సను పరిశీలించినా సమస్యను పరిష్కరించలేదు. సర్వీస్‌ రోడ్డును బాగుచేసి, అండర్‌పా్‌సను ఉపయోగంలోకి తీసుకువస్తేనే సమస్యలు తీరుతాయని సిబ్బంది పేర్కొంటున్నారు.  

Updated Date - 2021-10-22T05:44:54+05:30 IST