‘మీపై నమ్మకం పోయింది’ అంటూ దేశాధ్యక్షుడినే కడిగిపారేసిన నర్సులు!

ABN , First Publish Date - 2020-05-17T13:42:35+05:30 IST

ఫ్రాన్స్ దేశాధ్యక్షుడినే కడిగిపారేసిన నర్సులు

‘మీపై నమ్మకం పోయింది’ అంటూ దేశాధ్యక్షుడినే కడిగిపారేసిన నర్సులు!

పారిస్: అది ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో గల ఓ ప్రముఖ ఆస్పత్రి. వారు.. ప్రాణాపాయం ఉందని తెలిసీ కరోనా బాధితులకు సేవ చేస్తున్న నర్సులు. కాగా.. శుక్రవారం నాడు దేశాధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ సదరు ఆస్పత్రిని సందర్శించారు. అక్కడున్న సిబ్బందితో ముచ్చటిస్తున్నారు. అయితే రక్షణ దుస్తుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న నర్సుల్లో అధ్యక్షుడిని చూడగానే ఆగ్రహం పెల్లుబికింది. దీంతో వారు.. ‘మీపై నమ్మకం పోయింది’ అంటూ మాక్రాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస రక్షణ లేకుండా తాము కరోనాతో పోరాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. తమ అవస్థల గురించి అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉపయోగం లేకపోయిందని వారు అధ్యక్షుడి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆస్పత్రిలోని పరిస్థితిపై అవగహన ఉన్న ప్రభుత్వం.. అధ్యక్షుడి ఇమేజీ కాపాడేందుకు మీడియాను ఈ పర్యటనను కవర్ చేసేందుకు అనుమతించలేదు. కానీ అక్కడ ఉన్న కొందరు తమ స్మార్ట్‌ఫోన్‌లో నర్సుల ఆవేదనను చిత్రీకరించడంతో ఈ వీడియో సోషల్ మీడియా బాటపట్టి ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Updated Date - 2020-05-17T13:42:35+05:30 IST