కంట్లో కారం చల్లి, గొంతును కత్తితో కోసి...
ABN , First Publish Date - 2020-08-12T16:04:24+05:30 IST
ఓ కిరాణా షాపు నిర్వాహకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం చల్లి, గొంతు కోసి పారిపోయిన సంఘటన హయత్నగర్లో చోటుచేసుకుంది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిర్యాలగూడ గరిడెపల్లికి చెందిన బొంతు అంజన్రెడ్డి (52)
కిరాణా దుకాణం నిర్వాహకుడిపై దాడి
గుర్తు తెలియని దుండగుల ఘాతుకం
బాధితుడి పరిస్థితి విషమం
హయత్నగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఓ కిరాణా షాపు నిర్వాహకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కంట్లో కారం చల్లి, గొంతు కోసి పారిపోయిన సంఘటన హయత్నగర్లో చోటుచేసుకుంది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిర్యాలగూడ గరిడెపల్లికి చెందిన బొంతు అంజన్రెడ్డి (52) కొంతకాలంగా మన్సూరాబాద్ డివిజన్లోని కొలన్ శివారెడ్డి కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. హయత్నగర్ మదర్ డెయిరీ సమీపంలోని ప్రియదర్శిని కాలనీ శ్రీకృష్ణ దేవాలయం వద్ద అంజన్రెడ్డి కిరాణా షాపును నిర్వహిస్తున్నాడు. పని మీద సొంత ఊరుకు వెళ్లిన అంజన్రెడ్డి... తన భార్య, కూతురు, కూమారుడిని అక్కడే వదిలి మూడు రోజుల క్రితం హయత్నగర్కు తిరిగివచ్చాడు.
కాగా, గరిడెపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం 10 గంటలకు అంజన్రెడ్డికి ఫోన్ చేయగా తీయలేదు. సాయంత్రం 4.30 గంటలకు హయత్నగర్కు భార్య శిరీష, కుమారుడు శ్రావన్రెడ్డి కిరాణా షాపు వద్దకు వచ్చి చూడగా షట్టర్ వేసి ఉంది. వెంటనే షట్టర్ తీసి చూడగా అంజన్రెడ్డి కిందపడి ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు అంజన్రెడ్డి కళ్లల్లో కారంచల్లి, గొంతును కత్తితో కోశారని కొందరు చెబుతున్నట్లు తెలిసింది. వెంటనే విషయాన్ని హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రాణాపాయస్థితిలో ఉన్న అంజన్రెడ్డిని ఎల్బీనగర్లోని మ్యాక్స్క్యూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎలాంటి అలజడి లేకుండా ఈ సంఘటన ఎలా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని వనస్థలిపురం ఏసీపీ జయరాం, సీఐ సురేందర్, డీఐ నాగార్జున సందర్శించి పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.