Umar Khalid ప్రసంగం దేశద్రోహం కిందకు రాదు: Delhi HC
ABN , First Publish Date - 2022-05-31T18:22:54+05:30 IST
Select Author
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతిలో జేఎన్యూ విద్యార్థి (JNU Student) ఉమర్ ఖలీద్(Umar Khalid) చేసిన ప్రసంగం దేశవ్యతిరేక కార్యకలాపాల చట్టం పరిధిలోకి రాదని ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) సోమవారం అభిప్రాయపడింది. కాకపోతే ఉమర్ ప్రసంగంలో వాడిన పదజాలం ఆమోదయోగ్యం కాదని, కాస్త అసహ్యకరంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఢిల్లీలో సీఏఏ(CAA) వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య జరిగిన అల్లర్లకు ఉమర్ ప్రసంగం నిప్పు రగిల్చిందని, ఢిల్లీ పోలీసులు అతడిని 2020లో అరెస్ట్ చేశారు. అల్లర్లు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఉమర్ ఆ ప్రసంగం చేశారని చార్జ్షీట్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ హైకోర్టు దీనిని తప్పు పట్టింది. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. అయితే ఇందులో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి ఉమర్ను 2020 సెప్టెంబర్ 14న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై ఊపా చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఉమర్ ప్రసంగం దేశద్రోహం కాదని పేర్కొన్న ధర్మాసనం.. అతడికి బెయిల్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ‘‘ప్రసంగం ఉగ్రవాదపూరితంగా ఉందనే విషయంపై ప్రాసిక్యూషన్ జరుగుతున్నంత మాత్రాన దాన్ని నేరంగా పరిగణించలేము. కాకపోతే ఇది పరువు నష్టం, ఇతర నేరాలకు సమానం కావొచ్చు. అలా అని తీవ్రవాద చర్యతో పోల్చలేము’’ అని కోర్టు పేర్కొంది. ఇక ప్రధాని మోదీని ఉద్దేశించి ‘జుమ్లా’ అంటూ వ్యాఖ్యానించడం పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ‘విప్లవం’ అనే పదాన్ని ఉయోగించడం అల్లర్లను ప్రేరేపించడం కాదని సూచించింది. ఈ కేసుపై వాదనలను జూలై 4న వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.