వసంతవి దిగజారుడు రాజకీయాలు

ABN , First Publish Date - 2021-02-27T06:13:13+05:30 IST

వసంతవి దిగజారుడు రాజకీయాలు

వసంతవి దిగజారుడు రాజకీయాలు
మాట్లాడుతున్న దేవినేని ఉమా

గొల్లపూడి, ఫిబ్రవరి 26: మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ దిగజారుడు, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌లో సంపాదించిన డబ్బు విరజిమ్మి, దౌర్జన్యాలు, బెదిరింపులు, రౌడీయిజంతో మెజార్టీ పంచాయతీలను ఎమ్మెల్యే గెలిచారన్నారు. అన్నేరావుపేటలో వైసీపీ నేతలు చేసిన అరాచకాలే అందుకు నిదర్శమని ఉమా స్పష్టం చేశారు. పొందుగల, అన్నేరావుపేట, మూలపాడు గ్రామాల్లో కౌంటింగ్‌ సమయంలో మూడుసార్లు కరెంట్‌ ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పొందుగలలో ఎస్టీ మహిళను బెదిరించి రెండు ఓట్ల తేడాతో ఓడించి వారిపై దాడి చేయడం నిజం కాదా అని ఉమా నిలదీశారు. వసంతకు దమ్ముంటే మైలవరంలో కాని విజయవాడలోకి పొందుగల పంచాయతీకి రీ కౌంటింగ్‌ జరిపించాలని సవాల్‌ విసిరారు. వైసీపీ నాయకుడి జేబులో 13 ఓటర్‌ స్లిప్పులు దొరికాయంటే పోలింగ్‌ ప్రక్రియ ఎంత సజావుగా చేపట్టారో అర్థమవుతోందన్నారు. అధికారులు ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి పోటా పోటీ ఉన్న చోట అక్రమాలకు తెరలేపారని ఆయన ఆరోపించారు. రెడ్డిగూడెంలో నామినేషన్ల ప్రక్రియలో వసంత పీఏలు దందాగిరి చేశారన్నారు. జిల్లాలో 25 ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ ప్రజలకు సేవ చేసిన బొమ్మసాని సుబ్బారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించడం విడ్డూరంగా ఉందన్నారు. గొల్లపూడిలో టీడీపీ మద్దతుతో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన ఎస్సీ, బీసీ అభ్యర్థులను భయపెట్టి తమ పార్టీ కండువాలు కప్పించుకోవడం వసంతకే చెల్లిందన్నారు. న్యాయ, ప్రజా పోరాటాల ద్వారా ప్రజా స్వామ్యాన్ని బతికించుకుంటామని ఉమా స్పష్టం చేశారు. వడ్లమూడి చలపతిరావు, నర్రా వాసు, గూడపాటి పద్మశేఖర్‌, కోమటి రామ్మోహన్‌, జాలిపర్తి గోపాలకృష్ణ, ఆలూరి హరికృష్ణ, టీడీపీ బలపర్చిన పొందుగల సర్పంచ్‌ అభ్యర్థిని గుగులోతు కుమారి, బాణావతు రమేష్‌, వడ్లమూడి జగన్మోహన్‌రావు, గారే సుమన్‌ సమావేశంలో పాల్గొన్నారు. 



Updated Date - 2021-02-27T06:13:13+05:30 IST