భారత్ రాజకీయ, వైద్య సాయం చేయాలి : ఉక్రెయిన్ ఎంపీ

ABN , First Publish Date - 2022-02-25T18:36:11+05:30 IST

రష్యా దాడుల నేపథ్యంలో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్

భారత్ రాజకీయ, వైద్య సాయం చేయాలి : ఉక్రెయిన్ ఎంపీ

కీవ్ : రష్యా దాడుల నేపథ్యంలో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ అనేక విధాలుగా సంక్షోభంలో పడింది. ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని రక్షణ కోసం పరుగులు తీస్తున్నారు. ఇటువంటి సమయంలో తమను రాజకీయ, వైద్య రంగాల్లో ఆదుకోవాలని ఉక్రెయిన్ ఎంపీ సోఫియా ఫెడీనా భారత దేశాన్ని కోరారు. 


ఉక్రెయిన్‌లోని ఓ బాంబు షెల్టర్‌లో ఉన్న సోఫియా ఫెడీనా భారత దేశంలోని ఓ టీవీ చానల్‌తో శుక్రవారం మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు కేవలం ఆయుధాలతో మద్దతు మాత్రమే కాకుండా, మానసిక సహకారం కూడా అవసరమని చెప్పారు. దురాక్రమణదారు రష్యాను శిక్షించవలసి ఉందన్నారు. శాంతియుతంగా జీవిస్తున్న ఉక్రెయినియన్లను రష్యన్లు చంపుతున్నారని చెప్పారు. ఓ సార్వభౌమాధికార దేశ మానవ హక్కులను కాపాడాలని భారత దేశంలోని రాజకీయ నాయకులందర్నీ కోరుతున్నట్లు తెలిపారు. 


దక్షిణ ఉక్రెయిన్‌లోని నౌకాశ్రయ నగరం ఓడెస్సా తమ స్వాధీనంలోనే ఉందని తెలిపారు. ఇది శత్రువుల చేతికి చిక్కినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. ఇవన్నీ రష్యన్లు సృష్టిస్తున్న వదంతులేనని చెప్పారు. తాను ఈ విషయాన్ని మరొక పార్లమెంటేరియన్‌తో ధ్రువీకరించుకుని చెప్తున్నానని తెలిపారు. 


Updated Date - 2022-02-25T18:36:11+05:30 IST