ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు న్యాయం
ABN , First Publish Date - 2022-06-21T16:41:18+05:30 IST
ఉక్రెయిన్-రష్యా దేశాల యుద్ధం కారణంగా వైద్య కోర్సులు చేస్తూ అర్ధాంతరంగా దేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు తగు న్యాయం చేస్తామని ప్రధాని
- ప్రధాని మోదీ భరోసా
బెంగళూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఉక్రెయిన్-రష్యా దేశాల యుద్ధం కారణంగా వైద్య కోర్సులు చేస్తూ అర్ధాంతరంగా దేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు తగు న్యాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. బెంగళూరులో సోమవారం ఆయన ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుని మృతి చెందిన కర్ణాటక వైద్య విద్యార్థి నవీన్ గ్యానగౌడర్ తండ్రి శేఖరప్ప గ్యానగౌడర్ను కలిసి సాంత్వన పలికారు. నవీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని అక్కడే ఉన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు సూచించారు. నవీన్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా చేయూతనిస్తోందని సీఎం బొ మ్మై ప్రధాని మోదీకి వివరించారు. ఉక్రెయిన్ నుంచి తిరిగివచ్చిన విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఇప్పటికే సంబంధిత శాఖకు సూచించామన్నారు. ఉక్రెయిన్లో యుద్ధం ప్రారంభమయ్యాక పూర్తిస్థాయిలో దౌత్యం జరిపి మన విద్యార్థులందరినీ సురక్షితంగా దేశానికి రప్పించామని అయితే నవీన్ మృతి తనను ఎంతగానో కలిచివేసిందని ప్రధాని అన్నారు. వైద్యకోర్సులకోసం మన విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ఇందుకు ఏదైనా వ్యవస్ధను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రధానికి నవీన్ తండ్రి సూచించగా ఆయన అవునంటూ తలూపారు.