కాబూల్ విమానాశ్రయానికి ఉగ్ర ముప్పు : బ్రిటన్
ABN , First Publish Date - 2021-08-26T21:25:27+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లోని అంతర్జాతీయ
లండన్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగ్రవాద ముప్పు ఉందని బ్రిటన్ హెచ్చరించింది. అక్కడి నుంచి తరలిపోవాలని ప్రజలను కోరింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వయిజరీని సవరించింది.
కాబూల్ ప్రాంతంలో పరిస్థితి చాలా అస్థిరంగా ఉందని బ్రిటన్లోని ఫారిన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎఫ్సీడీఓ) తెలిపింది. బ్రిటిష్ పౌరులు, ఇతరులు కాబూల్ విమానాశ్రయం నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోవాలని తెలిపింది. తదుపరి సూచన కోసం వేచి చూడాలని పేర్కొంది.
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థకు చెందిన అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ నుంచి ముప్పు ఉందని హెచ్చరించింది. ఆఫ్ఘనిస్థాన్లోని ఈ సంస్థ ఆత్మాహుతి, కారు బాంబు దాడులకు పాల్పడుతూ ఉంటుందని తెలిపింది.
‘‘కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళకండి. ఆ ప్రాంతంలో మీరు ఉంటే సురక్షిత ప్రదేశానికి వెళ్ళిపోండి. తదుపరి సలహా కోసం వేచి చూడండి’’ అని ఎఫ్సీడీఓ ట్రావెల్ అడ్వయిజరీ తెలిపింది.
అమెరికా, ఆస్ట్రేలియా కూడా ఇటువంటి హెచ్చరికలు చేసిన విషయం గమనార్హం. కాబూల్ విమానాశ్రయం ప్రస్తుతం అమెరికా దళాల నిర్వహణ, రక్షణలో ఉంది. దాదాపు 5,800 మంది అమెరికన్ సైనికులు ఇక్కడ ఉన్నారు.