పిల్లులను దారుణంగా చంపినందుకు.. కోర్టు ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2021-07-31T23:05:33+05:30 IST
యూకేలో పిల్లులను క్రూరంగా హింసించి చంపిన వ్యక్తికి కోర్టు శుక్రవారం ఐదేళ్లకు పైగా జైలుశిక్షను విధించింది.
లండన్: యూకేలో పిల్లులను క్రూరంగా హింసించి చంపిన వ్యక్తికి కోర్టు శుక్రవారం ఐదేళ్లకు పైగా జైలుశిక్షను విధించింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. స్టీవ్(54) అనే వ్యక్తి గతంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. ఆ సమయంలో రాత్రి పూట పిల్లులపై దాడులు చేస్తూ వచ్చాడు. 16 పిల్లులను కత్తితో దారుణంగా పొడవగా.. 9 పిల్లులు మరణించాయి. ఓ పెంపుడు పిల్లి యజమాని తన ఇంటిముందు సెక్యూరిటీ కెమెరా పెట్టడం వల్ల స్టీవ్ బాగోతం బయటపడింది. ఇంటిముందు పెంపుడు పిల్లి రక్తంతో పడి ఉండటంతో యజమాని వెంటనే సెక్యూరిటీ కెమెరాను పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ ఫుటేజ్ ఆధారంతో పోలీసులు స్టీవ్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. మొదట స్టీవ్ తన నేరాన్ని అంగీకరించలేదు. అయితే స్టీవ్ ఫోన్లో మరణించిన పిల్లుల ఫొటోలు ఉండటం, తన ఇంట్లో పిల్లుల రక్తంతో ఉన్న కత్తి దొరకడంతో తానే నేరం చేసినట్టు కోర్టు ముందు ఒప్పుకున్నాడు. స్టీవ్ చేసింది ఎంతో దారుణమైన పని అని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీవ్కు 5.3 ఏళ్ల జైలుశిక్షను విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు.