Graduate visa scheme: ఆ జాబితాలో Indian యూనివర్సిటీలకు దక్కని చోటు.. UK పై విమర్శలు..
ABN , First Publish Date - 2022-06-02T17:34:36+05:30 IST
ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచంలోని టాప్-50 యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక వీసా పథకాన్ని(High Potential Individual visa) ప్రకటించిన విషయం తెలిసిందే.
లండన్: ఇటీవల బ్రిటన్ ప్రభుత్వం ప్రపంచంలోని టాప్-50 యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థుల కోసం ఓ ప్రత్యేక వీసా పథకాన్ని(High Potential Individual visa) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టాప్-50 వర్సిటీల జాబితాను క్యూఎస్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ సంస్థలు రూపొందించాయి. అయితే, ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా చోటు దక్కలేదు. ఇప్పుడు ఇదే విషయమై యూకే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. 2020-21 ఏడాదికి గాను విడుదల చేసిన ఈ జాబితాలో డ్రాగన్ కంట్రీ చైనాకు చెందిన ఏకంగా నాలుగు విశ్వవిద్యాలయాలకు చోటు కల్పించారు. ఇంతకుముందు మూడు యూనివర్సిటీలు ఉండగా.. ఈ ఏడాది కొత్తగా Chinese University of Hong Kong (CUHK) ఈ లిస్ట్లో చేరింది. దీంతో చైనీస్ యూనిర్సిటీల సంఖ్య నాలుగుకు చేరింది. కానీ, భారత్లోని ఏ ఒక్క IIT కి కూడా ఈ జాబితాలో చోటు కల్పించకపోవడంతో బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.
ఇదిలాఉంటే.. ఈ ప్రపంచ టాప్-50 యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులకు UK వీసా సులభంగా లభించనుంది. బ్రిటన్ సర్కారు సోమవారం(మే 30న) ప్రకటించిన ‘హై పొటెన్షియల్ స్కీమ్’ లో వర్క్ వీసా వెంటనే వస్తుంది. ప్రతిభావంతులకు ప్రోత్సాహమివ్వడంలో భాగంగా పట్టభద్రులకు రెండేళ్లు, పీహెచ్డీ పట్టా పొందిన వారికి మూడేళ్ల వర్క్ వీసా జారీ చేస్తామని భారత సంతతికి చెందిన కేబినెట్ మంత్రులు రిషి సనక్, ప్రీతి పటేల్ తెలిపారు. ఈ వీసా చార్జి 715 పౌండ్లు (రూ.70వేలు)గా ఉంటుంది. బ్రిటన్ వెళ్లేవారి బ్యాంకు ఖాతాలో కనీసం 1,270 పౌండ్లు(రూ.1.24 లక్షలు) నిల్వలు ఉండాలి. ఈ వీసాలపై బ్రిటన్కు వచ్చేవారు తమ కుటుంబ సభ్యులు, ఆప్తులకు డిపెండెంట్ వీసాలు తీసుకోవచ్చు.