మరణాల్లో ఇటలీని దాటేసిన బ్రిటన్!

ABN , First Publish Date - 2020-05-05T21:45:52+05:30 IST

కోవిడ్-19 కారణంగా బ్రిటన్‌లో ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక గణాంకాలు

మరణాల్లో ఇటలీని దాటేసిన బ్రిటన్!

లండన్: కోవిడ్-19 కారణంగా బ్రిటన్‌లో ఇప్పటి వరకు 32 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కరోనా అనుమానిత మరణాలను కూడా చేర్చడంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏప్రిల్ 24 నాటికి ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో 29,648 మంది ప్రాణాలు కోల్పోయినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం తెలిపింది. వీరందరూ కోవిడ్-19 కారణంగా మరణించినట్టు వారి డెత్ సర్టిఫికెట్లలో పేర్కొంది. ఇందులో స్కాట్లాండ్, ఉత్తర ఐర్లండ్‌లో సంభవించిన మరణాలు కూడా ఉన్నాయి. తాజాగా, వీటిలో అనుమానిత కోవిడ్ మరణాలను కూడా చేర్చడంతో మృతుల సంఖ్య 32 వేలు దాటేసింది. దేశంలో ఇప్పటి వరకు 32,313 మంది కోవిడ్ కారణంగా మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. యూరప్‌‌లో ఇప్పటి వరకు ఇటలీలోనే అత్యధిక మరణాలు సంభవించగా, ఇప్పుడు ఆ దేశాన్ని బ్రిటన్ దాటేసింది. అయితే, ఇటలీ మరణాల్లో కరోనా అనుమానిత మరణాలను చేర్చలేదు. 

Updated Date - 2020-05-05T21:45:52+05:30 IST