అలరించిన ఉగాది వేడుకలు
ABN , First Publish Date - 2022-04-03T15:13:14+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీశుభకృత్ నామ
ప్యారీస్(చెన్నై): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో శ్రీశుభకృత్ నామ సంవత్సర తెలుగు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక మైలాపూర్లోని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవనంలో ప్రార్థనాగీతంతో ఆ ప్రారంభమైన ఈ వేడులకు ప్రముఖ సినీ గేయరచయిత, కమిటీ సభ్యులు భువనచంద్ర అధ్యక్షత వహించగా, కమిటీ చైర్మన్ కాకుటూరు అనిల్కుమార్రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. రచయిత ప్రణవి రచించిన ‘జీవన వేదం’ పుస్తకాన్ని అనిల్కుమార్రెడ్డి ఆవిష్కరించగా, తొలిప్రతిని కమిటీ సభ్యులు జేఎం నాయుడు స్వీకరించారు. కమిటీ సభ్యులు మాఢభూషి సంపత్ కుమార్, తెలుగు ప్రముఖులు సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎల్బీ శంకర్లు జీవన వేదం పుస్తకంలోని అంశాలపై ప్రసంగించారు. అనంతరం తెలుగు మహాజన సమాజం తరఫున ఆ సంస్థ అధ్యక్షులు కాకుటూరు అనిల్కుమార్రెడ్డి ప్రణవికి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు నగదు బహుమతిగా రూ.10 వేలు బహూకరించారు. ఆ తర్వాత కమిటీ సభ్యులు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి డా.విస్తాలి శంకరరావు నేతృత్వంలో జరిగిన కవి సమ్మేళనం అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎం.శంకరబాబు, ఎం.కోటీశ్వరులు, ఎస్.శశికళ, జి.రోజా, వి.నీలిమ, దాసరి శాంతి, విశ్రాంత రైల్వే టీటీఆర్ కనపర్తి మాలకొండయ్య, మాఢభూషి సంపత్ కుమార్, అముక్త మాల్యద, లింగమనేని సుజాత, ప్రణవి, భువనచంద్ర, విస్తాలి శంకరరావు వేర్వురు శీర్షికలపై కవితలు చదివారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి, కోశాధికారి ఒంటెల కృష్ణారావు, డా. ఎంవీ నారాయణ గుప్తా, గుడిమెట్ల చెన్నయ్య, డా.ఏవీ శివకుమారి సహా పలువురు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.