ఆనకట్టకు మహర్దశ!

ABN , First Publish Date - 2021-08-04T04:16:57+05:30 IST

శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన ఉదయగిరి ఆనకట్టకు(చెరువు) మహర్దశ పట్టనుంది.

ఆనకట్టకు మహర్దశ!
ఉదయగిరి ఆనకట్ట

ఆధునికీకరణకు రూ.15 కోట్లు మంజూరు

ట్యాంక్‌బండ్‌ తరహాలో సుందరీకరణ

త్వరలో పనులు ప్రారంభం

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 3: శ్రీకృష్ణదేవరాయుల కాలంలో నిర్మించిన ఉదయగిరి ఆనకట్టకు(చెరువు) మహర్దశ పట్టనుంది. జిల్లా కలెక్టర్‌ చక్రధరబాబు చొరవతో ఆనకట్టను ట్యాంక్‌బండ్‌ తరహాలో సుందరీకరణ చేసేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలో 47 చెరువులకు రూ.70.35 కోట్లు మంజూరు కాగా ఒక్క ఉదయగిరి ఆనకట్టకే రూ.15 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో అధికారులు పనులు చేపట్టనున్నారు. మురికి కూపంగా మారిన ఆనకట్ట సుందరంగా తీర్చిదిద్దాలన్న పట్టణ వాసుల కల నెరవేరే సమయం అసన్నమైంది. 

సుందరీకరణ ఇలా : ఉదయగిరి ఆనకట్ట 45/2, 50, 52 సర్వేనెంబర్లలో 23.15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆనకట్ట చుట్టూరా 1340 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో బండ్‌, రివిట్‌మెంట్‌ ఏర్పాటు చేయనున్నారు. బండ్‌పై 2 మీటర్ల వాకింగ్‌ ట్రాక్‌, విద్యుత్‌ దీపాలు, బెంచీలు ఏర్పాటు చేస్తారు. తూర్పు, పడమర వైపుల రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేస్తారు. పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు ఆనకట్టలో కలవకుండా బయటకు పంపేందుకు 333 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడప్పులతో వేస్ట్‌ వాటర్‌ డ్రైన్‌ నిర్మించనున్నారు. ఈ డ్రైన్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చించనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. కట్టకు తూర్పువైపు పార్కు నిర్మాణానికి సైతం చర్యలు చేపడుతున్నారు. పట్టణ ముఖద్వారంలో ఉన్న ఆనకట్టను ట్యాంక్‌బండ్‌ తరహాలో తీర్చిదిద్దనుండడంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని పట్టణ వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలో పనులు చేపడతాం

ఉదయగిరి ఆనకట్టను ట్యాంక్‌బండ్‌ తరహాలో సుందరీకరణ చేసేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసింది. త్వరలో పనులు చేపడతాం. 

- రవి, ఇరిగేషన్‌ డీఈ




Updated Date - 2021-08-04T04:16:57+05:30 IST