Uddhav Thackeray Shiv Sena : 50 లక్షల మంది నుంచి విధేయత పత్రాల సేకరణకు సన్నాహాలు
ABN , First Publish Date - 2022-07-21T22:33:56+05:30 IST
శివసేన (Shiv Sena) పార్టీ చీలిపోవడంతో ఎవరి నాయకత్వంలో అసలు
ముంబై : శివసేన (Shiv Sena) పార్టీ చీలిపోవడంతో ఎవరి నాయకత్వంలో అసలు శివసేన ఉందనే విషయంపై తర్జనభర్జన జరుగుతోంది. ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని వర్గం ఎన్నికల కమిషన్ను ఆశ్రయించి, తమదే అసలైన శివసేన అని గుర్తించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) 50 లక్షల మంది కార్యకర్తల నుంచి విధేయతా పత్రాలను సేకరించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
శివసేన జిల్లా శాఖల అధ్యక్షులకు ఉద్ధవ్ థాకరే ఇచ్చిన ఆదేశాల్లో ప్రాథమిక సభ్యుల నుంచి విధేయతా ప్రమాణ పత్రాలను సేకరించాలని తెలిపారు. శివసేన రాజ్యాంగానికి, పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరేకు, పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేకు విధేయతను ప్రకటిస్తూ ప్రమాణ పత్రాలను సేకరించాలని కోరారు. మొత్తం మీద 50 లక్షల అఫిడవిట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరికొద్ది రోజుల్లో ఈ అఫిడవిట్లను సమర్పించాలని శివసేన ఆఫీస్ బేరర్లను కోరారు. శివసేన పార్టీ వ్యవస్థపై హక్కును షిండే వర్గం కోరకుండా నిరోధించేందుకు, రాష్ట్ర శాసన సభకు వెలుపల కార్యకర్తలు, నేతల మద్దతు తనకు ఉందని చెప్పుకోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఉద్ధవ్ వర్గం చెప్తోంది. పార్టీ ఎన్నికల గుర్తు బాణం ఎక్కుపెట్టిన విల్లును నిలబెట్టుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది.
శివసేన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, తమ పార్టీలో ప్రాథమిక సభ్యత్వంగలవారు 36 లక్షల మంది ఉన్నారని, ఈ సంఖ్య 50 లక్షలకు చేరే అవకాశం ఉందని, అందుకే జిల్లా పార్టీ చీఫ్లకు ఈ లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార ఫలాలను అనుభవిస్తారని, వీరు తమకు ఇక ఉపయోగపడరని బీజేపీ భావించినపుడు, వీరిని చెత్తబుట్టలో పడేస్తుందని అన్నారు. ఈ కష్టకాలం నుంచి బయటపడటమే తమ ముందు ఉన్న మార్గమని చెప్పారు.