Dussehra rally: ఉద్ధవ్ థాకరేకు హైకోర్టు భారీ ఊరట
ABN , First Publish Date - 2022-09-23T22:58:13+05:30 IST
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేనకు బోంబే హైకోర్టు (Bombay High Court)లో శుక్రవారం ఊరట లభించింది. దసరా సందర్భంగా అక్టోబరు 5న బహిరంగ సభను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సభ నిర్వహణకు అంతకుముందు బృహన్ముంబై నగర పాలక సంస్థ అనుమతిని నిరాకరించింది.
బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఆర్డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బీఎంసీ ఆదేశాలు న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 6 వరకు శివాజీ పార్కును ఉపయోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని షరతు విధించింది.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఎమ్మెల్యే సదా సర్వంకర్ కూడా బహిరంగ సభ నిర్వహణకు అనుమతించాలని బీఎంసీకి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును కూడా బీఎంసీ సెప్టెంబరు 21న తిరస్కరించింది. ఇరు వర్గాలు దరఖాస్తు చేసినందు వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని స్థానిక పోలీసులు హెచ్చరించారని తెలిపింది.