ఒక్కరే దిక్కు..!
ABN , First Publish Date - 2022-06-29T03:12:11+05:30 IST
జిల్లా కేంద్రానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు కరువు.
డాక్టర్ల నియామకంలో నిర్లక్ష్యం
వైద్యసేవలందక రోగుల ఇక్కట్లు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
ఇది ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం దుస్థితి
ఉదయగిరి రూరల్, జూన్ 28: జిల్లా కేంద్రానికి వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు కరువు. ఇది మెట్ట ప్రాంతం కావడం, అధికంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఉండడం, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వ వైద్యశాలకు వెళుతుంటారు. ప్రతిరోజు 150 నుంచి 170 మంది రోగులు వివిధ సమస్యలపై వైద్యశాలకు వస్తుంటారు. అయితే అంతమంది రోగులకు ఇక్కడ సేవలందించేది ఒక్క డాక్టరే. ఆమె సాధారణ ఓపీతోపాటు రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, ఇన్పేషెంట్లు, గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఇది ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్ర దుస్థితి.
ఒక్క డాక్టరే దిక్కు : వైద్యశాలలో సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, చిన్నపిల్లలు, మత్తు, గైనకాలజిస్టుతోపాటు జనరల్ వైద్యులు మరో ముగ్గురుతో కలపి 9 మంది డాక్టర్లు ఉండాలి. ఈ పోస్టులు గత కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఒక్క వైద్యురాలే అందరికీ పరీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతినెలా 9న నిర్వహించే ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన పథకం కింద గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉన్న ఒక్క వైద్యురాలు అటు ఓపీ, ఇటు గర్భిణులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఒక్కోసారి గర్భిణుల పరీక్షలు ఆలస్యమవుతుండడంతో వారు సొమ్మసిల్లిపోతున్నారు. వైద్యశాలను 30 నుంచి 50 పడకలకు మార్చే ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉండడంతో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఉదయగిరి వైద్యశాలలో వైద్యలు, సిబ్బందిని నియమించి రోగులకు మెరుగైన సేవలందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
వైద్యులను త్వరలో నియమిస్తాం
ఉదయగిరి వైద్యశాలలో వైద్యుల కొరత వాస్తవమే. ప్రభుత్వం త్వరలో వైద్యుల పోస్టులను భర్తీ చేయనుంది. తప్పక ఉదయగిరిలో వైద్యులను నియమిస్తాం.
- రమేష్నాథ్, డీసీహెచ్ఎస్