టీకా ఆలస్యమైతే వృద్ధికి గండి

ABN , First Publish Date - 2021-01-14T06:47:18+05:30 IST

వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు కొవిడ్‌ టీకాల కార్యక్రమం విజయవంతంపై ఆధారపడి ఉంటుందని యూబీఎస్‌ పేర్కొంది.

టీకా ఆలస్యమైతే వృద్ధికి గండి

యూబీఎస్‌ హెచ్చరిక


ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు కొవిడ్‌ టీకాల కార్యక్రమం విజయవంతంపై ఆధారపడి ఉంటుందని యూబీఎస్‌ పేర్కొంది. టీకా ఇవ్వడం ఏ మాత్రం జాప్యం అయినా వృద్ధిరేటు ప్రభావితం కావచ్చునని హెచ్చరించింది. టీకా  కొనుగోలు, రవాణా, నిల్వల కోసం ప్రభుత్వానికి ఎంత లేదన్నా రూ.50,000 కోట్ల వరకు ఖర్చవుతుందని తెలిపింది. 


అక్టోబరు నుంచి రికవరీ 

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మైనస్‌ 23.9 శాతం పడిపోయిన భారత జీడీపీ వృద్ధి రేటు గత ఏడాది అక్టోబరు నుంచి మళ్లీ గాడిలో పడిందని యూబీఎస్‌ పేర్కొంది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 0.4 శాతానికి మించి క్షీణించక పోవచ్చని అంచనా వేసింది. మార్చి, 2021తో ముగిసే నాలుగో త్రైమాసికంలో మాత్రం జీడీపీ 0.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని తెలిపింది. అయినా 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే జీడీపీ వృద్ధి రేటుకు 7.5 శాతం గండిపడుతుందని తెలిపింది. 


కొవిడ్‌ కష్టాలు ఉన్నా ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) భారత జీడీపీ మైనస్‌ 7.5 శాతానికి మించి తగ్గక పోవచ్చని స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌ తాజా నివేదికలో పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం అంచనా వేసిన మైనస్‌ 7.7 శాతం కంటే ఇది తక్కువ. అమెరికాకు చెందిన మరో బ్రోకరేజీ సంస్థ బోఫా సెక్యూరిటీస్‌ భారత జీడీపీకి సంబంధించి మరింత ఆశాజనక అంచనాలు వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా 2020-21లో భారత జీడీపీ క్షీణత మైనస్‌ 6.7 శాతం మించదని తెలిపింది.  

Updated Date - 2021-01-14T06:47:18+05:30 IST