యూఏఈలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 994 కొత్త కేసులు
ABN , First Publish Date - 2020-05-23T15:20:01+05:30 IST
కరోనా కోరల్లో చిక్కుకుని గల్ఫ్ దేశాలు విలవిలలాడుతున్నాయి.
యూఏఈ: కరోనా కోరల్లో చిక్కుకుని గల్ఫ్ దేశాలు విలవిలలాడుతున్నాయి. ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. యూఏఈలో ఈ మహమ్మారి రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో శుక్రవారం ఒక్కరోజే 994 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ 994 కొత్త కేసులతో కలిపి యూఏఈలో కరోనా బాధితుల సంఖ్య 27,892కి చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 1,043 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,798కి చేరింది. శుక్రవారం సంభవించిన నాలుగు మరణాలతో కలిపి ఆ దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారు 241 మంది అయ్యారు.
ఇక ఈ మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ టెస్టులు ముమ్మరం చేసిన యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 1.5 మిలియన్కు పైగా పరీక్షలు నిర్వహించింది. శుక్రవారం కూడా దేశ వ్యాప్తంగా 50,000 కరోనా టెస్టులు నిర్వహించిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే... ప్రపంచవ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న ఈ వైరస్ ఇప్పటికే 3.40 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. 53 లక్షల మంది బాధితులు ఉన్నారు.