యూఏఈలో ఒక్కరోజే 716 కొత్త కేసులు...
ABN , First Publish Date - 2020-07-05T17:12:51+05:30 IST
గల్ప్ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా.. అటు యూఏఈలో మళ్లీ విజృంభిస్తోంది. మధ్యలో కొన్ని రోజులు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.
యూఏఈ: గల్ప్ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా.. అటు యూఏఈలో మళ్లీ విజృంభిస్తోంది. మధ్యలో కొన్ని రోజులు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేల మార్కును దాటింది. శనివారం నమోదైన 716 కొత్త కేసులతో కలిపి యూఏఈలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 50,857కు చేరింది. కాగా, నిన్న ఒకేరోజు 704 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దాంతో మొత్తం కోలుకున్న వారు 39,857 మంది అయ్యారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక శనివారం సంభవించిన మూడు మరణాలతో కలిపి ఇప్పటి వరకు ఈ వైరస్తో మరణించిన వారు 321 మంది అయ్యారు. మరో 10,679 మంది కోవిడ్ బాధితులు దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక కరోనా కట్టడి కోసం ముమ్మరంగా టెస్టులు నిర్వహిస్తున్న యూఏఈ... ఇప్పటికే 3 మిలియన్లకు పైగా కోవిడ్ పరీక్షలు చేసినట్టు ప్రకటించింది. మంగళవారం కూడా దేశవ్యాప్తంగా 71వేల కరోనా పరీక్షలు చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు ముఖానికి మాస్కు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు సూచిస్తోంది. ఈ ముందు జాగ్రత్త చర్యలను ఉల్లంఘించిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారికి యూఏఈ అధికారులు 2వేల దిర్హామ్స్ నుంచి 10వేల దిర్హామ్స్ వరకు జరిమానా కూడా విధిస్తున్నారు.