యూఏఈలో క‌రోనా క‌ల్లోలం.. ఒక్క‌రోజే 624 కొత్త కేసులు

ABN , First Publish Date - 2020-06-06T15:25:42+05:30 IST

గ‌ల్ఫ్ దేశాల్లో క‌రోనా కల్లోలం కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌, యూఏఈలో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది.

యూఏఈలో క‌రోనా క‌ల్లోలం.. ఒక్క‌రోజే 624 కొత్త కేసులు

యూఏఈ: గ‌ల్ఫ్ దేశాల్లో క‌రోనా కల్లోలం కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, ఖ‌తార్‌, కువైట్‌, యూఏఈలో దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో ఈ మ‌హ‌మ్మారి‌ రోజురోజుకు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. దీంతో శుక్ర‌వారం ఒక్క‌రోజే 624 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఈ 624 కొత్త కేసుల‌తో క‌లిపి యూఏఈలో క‌రోనా బాధితుల సంఖ్య 37,642కి చేరింద‌ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అలాగే 765 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,337కి చేరింది. అలాగే మ‌రో 17,031 మంది క‌రోనా బాధితులు దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.


శుక్ర‌వారం సంభ‌వించిన ఒక‌ మ‌ర‌ణంతో‌ క‌లిపి ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారు 274 మంది అయ్యారు. ఇక ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా కోవిడ్‌‌ టెస్టులు ముమ్మ‌రం చేసిన యూఏఈ ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు ఏకంగా 2 మిలియ‌న్‌కు పైగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. శుక్ర‌వారం కూడా దేశ వ్యాప్తంగా 44,000 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా విరుచుకుప‌డుతున్న‌‌ ఈ వైర‌స్ ఇప్ప‌టికే 3.98 లక్ష‌ల మందిని పొట్ట‌న‌బెట్టుకుంది. 68.50 ల‌క్ష‌ల మంది బాధితులు ఉన్నారు.  

Updated Date - 2020-06-06T15:25:42+05:30 IST