యూఏఈలో పంజా విసురుతున్న‌ 'క‌రోనా'...

ABN , First Publish Date - 2020-06-03T14:40:14+05:30 IST

ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్.. అటు గ‌ల్ఫ్‌లో కూడా శ‌ర‌వేగంగా విస్తరిస్తోంది.

యూఏఈలో పంజా విసురుతున్న‌ 'క‌రోనా'...

యూఏఈ: ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్.. అటు గ‌ల్ఫ్‌లో కూడా శ‌ర‌వేగంగా విస్తరిస్తోంది. ప్ర‌ధానంగా యూఏఈ, ఖ‌తార్‌, సౌదీ అరేబియా, కువైట్‌లో ఈ వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంది. యూఏఈలో రోజురోజుకీ ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. మంగ‌ళ‌వారం కూడా ఏకంగా 596 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో యూఏఈలో 'కోవిడ్‌-19' సోకిన వారి సంఖ్య 35,788కి చేరింద‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ తెలిపింది. నిన్న‌ 388 మంది కోలుకుని ఆస్ప‌త్రిని నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారు 18,726 మంది అయ్యారు. అలాగే మంగ‌ళ‌వారం సంభ‌వించిన మూడు మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశ‌వ్యాప్తంగా మొత్తం 269 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. మ‌రో 16,793 మంది దేశంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.


మ‌రోవైపు ఈ వైర‌స్ క‌ట్ట‌డి కోసం యూఏఈ ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 2 మిలియ‌న్‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన యూఏఈ... వీటిలో 650,000 టెస్టులు కేవ‌లం గ‌త రెండు వారాల్లోనే చేయ‌డం విశేషం. మంగ‌ళ‌వారం కూడా 35,000 కోవిడ్ టెస్టులు చేసింది. ఇక క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ముఖ్యంగా  సామాజిక దూరం పాటించ‌డం, బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని ఈ సంద‌ర్భంగా ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ బాధితులు 60 ల‌క్ష‌లు దాటిపోగా, మృతుల సంఖ్య 3.82 లక్ష‌లుగా ఉంది.       


Updated Date - 2020-06-03T14:40:14+05:30 IST