యూఏఈలో మహమ్మారి విజృంభణ..!
ABN , First Publish Date - 2020-06-04T14:46:57+05:30 IST
గల్ఫ్లో శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యూఏఈలో విజృంభిస్తోంది.
యూఏఈ: గల్ఫ్లో శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్.. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యూఏఈలో విజృంభిస్తోంది. బుధవారం యూఏఈలో ఏకంగా 571 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 36,359 మంది ఈ వైరస్ బారిన పడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే 427 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో యూఏఈలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,153కి చేరింది. నిన్న ఒకరు కోవిడ్తో చనిపోయారు. ఇప్పటివరకు ఆ దేశంలో 270 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మరో 16,936 మంది దేశంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కోవిడ్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా కరోనా టెస్టులు ముమ్మరం చేసిన యూఏఈ ఇప్పటికే 2 మిలియన్కు పైగా మందికి టెస్టులు నిర్వహించింది. ఇదిలాఉంటే... ప్రపంచవ్యాప్తంగా స్వైర విహారం చేస్తున్న ఈ వైరస్ ధాటికి ఇప్పటికే 3.87 లక్షల మంది మరణించారు. 65 లక్షలకు పైగా మంది బాధితులు ఉన్నారు.