UAE నిర్ణయంతో ఎగిరి గంతేస్తున్న భారతీయులు.. అయితే ఓ కండిషన్!

ABN , First Publish Date - 2021-08-29T21:56:42+05:30 IST

టూరిస్ట్ వీసాలను అనుమతిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి విమానయాన..

UAE నిర్ణయంతో ఎగిరి గంతేస్తున్న భారతీయులు.. అయితే ఓ కండిషన్!

దుబాయ్: టూరిస్ట్ వీసాలను అనుమతిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి విమానయాన సంస్థల యాజమాన్యాలకు కొత్త ఉత్సాహం వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్న వారిని ఈ నెల 30 నుంచి దేశంలోనికి అనుమతించనున్నట్లు యూఏఈ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో భారత్ వంటి అనేక దేశాలపై ఇంతకుముందు యూఏఈ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే తాజా ఉత్తర్వులతో ఆయా దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చేందుకు అనుమతిచ్చింది.


కాగా.. యూఏఈ నిర్ణయంపై యూఏఈలో ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్స్‌కు సంబంధించిన భారతీయ న్యాయ సంస్థ సరిన్&కో కార్యకలాపాల ప్రధాన అధికారి వినమ్ర లొంగాని తాజాగా స్పందించారు. ‘భారత్‌లో కోవిడ్ రెండో దశ విజృంభించిన నేపథ్యంలో ప్రపంచంలోని అనేక దేశాలు భారత ప్రజలు తమ దేశంలోకి రాకుండా కఠిన నిబంధనలు విధించాయి. యూఏఈ కూడా భారతీయ టూరిస్టులు దేశంలోనికి రాకుండా నిషేధం విధించింది. అయితే ఇటీవలి కాలంలో భారత్‌లో కోవిడ్ ప్రభావం తగ్గడంతో ఆయా దేశాలు నిషేధాన్ని సడలించాయి. ఈ క్రమంలోనే యూఏఈ కూడా నిషేధాన్ని ఎత్తివేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనేకమంది భారత టూరిస్టులు యూఏఈతో పాటు మిగిలిన దేశాలకు కూడా క్యూ కడుతున్నారు. దీంతో విమానాయాన సంస్థలకు మళ్లీ ఆదాయం లభిస్తుంది’ అని లొంగానీ అన్నారు.


ఇదిలా ఉంటే రెండో త్రైమాసికంలో భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ విపరీతంగా విజృంభించింది. రోజూ లక్షల కేసులు నమోదయ్యాయి. వేల మంది మరణించారు. ఈ క్రమంలోనే భారత్ నుంచి వచ్చే జాతీయ, అంతర్జాతీయ విమానాలపై యూఏఈకి చెందిన జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రిసిస్ అండ్ డిజాస్టర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) ఏప్రిల్ 24న నిషేధం విధించింది.

Updated Date - 2021-08-29T21:56:42+05:30 IST