యూఏఈలో 90 శాతానికి చేరిన రికవరీ రేటు..!
ABN , First Publish Date - 2020-08-05T14:57:21+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి యూఏఈ క్రమంగా బయటపడుతోంది. అక్కడ కోవిడ్-19 ఉధృతి రోజురోజుకీ తగ్గుతు వస్తోంది.
యూఏఈ: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం నుంచి యూఏఈ క్రమంగా బయటపడుతోంది. అక్కడ కోవిడ్-19 ఉధృతి రోజురోజుకీ తగ్గుతు వస్తోంది. పాజిటివ్ కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి. వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారు అంతకంతకు పెరుగుతుండడంతో రికవరీ రేటు 90 శాతానికి చేరినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేగాక యూఏఈలో వరుసగా నాలుగు రోజులుగా ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం శుభపరిణామం అని అధికారులు తెలిపారు.
ఇక మంగళవారం దేశవ్యాప్తంగా 189 కొత్త కేసులు నమోదైతే... 227 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 61,352కు చేరితే... మొత్తం రికవరీలు 55,090 అయ్యాయి. అలాగే యూఏఈ వ్యాప్తంగా ఇప్పటికే 351 మందిని కరోనా బలిగొంది. ప్రస్తుతం దేశంలో 5,911 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న యూఏఈ ఇప్పటికే 5 మిలియన్లకు పైగా కోవిడ్ టెస్టులు పూర్తి చేసింది. ఈ నెలాఖరు వరకు 6 మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేయాలని నిర్ధేశించుకుంది.