లాక్డౌన్ను ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు
ABN , First Publish Date - 2020-04-03T09:46:08+05:30 IST
యావత్ జాతిని కలవరపరుస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి సమష్టిగా, సమర్థంగా పనిచేయడం ప్రశంసనీయం. రాజకీయాలకు అతీతంగా ఈ మహమ్మారిపై యుద్ధం చేద్దాం. మనం తీసుకున్న ముందస్తు...
- దుష్ప్రచారం చేస్తే జైలుతోపాటు జరిమానా
- కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
యావత్ జాతిని కలవరపరుస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి సమష్టిగా, సమర్థంగా పనిచేయడం ప్రశంసనీయం. రాజకీయాలకు అతీతంగా ఈ మహమ్మారిపై యుద్ధం చేద్దాం. మనం తీసుకున్న ముందస్తు జాగ్రత్త, వైద్య నిర్వహణ చర్యలతో అతి తక్కువ ప్రాణనష్టంతో యటపడటమే మన ముందున్న ప్రధాన లక్ష్యం.
- ప్రధాని మోదీ
లాక్డౌన్ను ఉల్లంఘించినా, విఘాతం కలిగించినా, దుష్ప్రచారం చేసినా.. కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిపై విపత్తు నిర్వహణ చట్టం, భారత శిక్షాస్మృతి ప్రకారం కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచించింది. చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అన్ని రాష్ట్రాల సీఎ్సలకు లేఖ రాశారు. విపత్తు నిర్వహణ చట్టం-2005, భారత శిక్షాస్మృతి సెక్షన్ 188 ప్రకారం లాక్డౌన్కు ఎవరైనా విఘాతం కలిగిస్తే రెండేళ్ల జైలు శిక్షకు అర్హులని, దుష్ప్రచారం చేస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానాకు అర్హులవుతారని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల అమలు స్థితిపై సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో చేపట్టిన చర్యలను 7వ తేదీలోగా వివరాలు అందించాలని రాష్ట్రాలకు సూచించారు.