రెండేళ్ల పాపతో రోడ్డుపక్కన నిద్రపోతున్న తల్లి.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో..
ABN , First Publish Date - 2020-07-11T15:49:27+05:30 IST
రెండేళ్ల పాపతో రోడ్డుపక్కన నిద్రపోతున్న తల్లి.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో..
తల్లి చెంత నిద్రిస్తున్న చిన్నారి కిడ్నాప్
ఖైరతాబాద్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్కన తల్లి చెంతన నిద్రిస్తున్న ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సైఫాబాద్ ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం... నార్సింగ్ నెక్నాపూర్కు చెందిన ముక్తార్బేగం, సయ్యద్ యాకుబ్ పాషా భార్యాభర్తలు. గతంలో రోడ్డు ప్రమాదంలో యాకుబ్పాషాకు కాళ్లు విరిగిపోయాయి. అప్పటి నుంచీ ముక్తార్ బేగం కుటుంబ భారం మోసేందుకు యాచిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చేరుకున్న ఆమె తన రెండేళ్ల కూతురు మహీన్ను ఎత్తుకొని గురువారం రాత్రి మాసబ్ట్యాంక్ మహవీర్ ఆస్పత్రి సమీపంలోని వర్ధమాన్ బ్యాంకు వద్ద నిద్రిస్తోంది. రాత్రి ఒంటి గంట సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి బాలికను ఎత్తుకొని వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె తేరుకొని ప్రతిఘటించింది. దీంతో అతడు పారిపోయాడు. కొద్దిసేపటికి నిద్రకు ఉపక్రమించగా, మరో వ్యక్తి వచ్చి చిన్నారిని దుప్పటి సహా ఎత్తుకొని పారిపోయాడు. ఆమె నిద్రలేచి అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చిన్నారిని ఆగంతుకులు ఆటోలో తీసుకొని వెళ్లినట్లు చూసిన తల్లి సైఫాబాద్ పోలీసులకు గోడు వినిపించుకుంది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆటోలో బాలికను అపహరించినట్టు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.