ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-07-26T05:15:56+05:30 IST

రాతి వనాల మధ్యలో ఉన్న లింగమయ్య చెరువులో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందారు.

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
మృతి చెందిన యువకులు

  1. ఓర్వకల్లు రాతివనాల్లోని లింగమయ్య చెరువులో ప్రమాదం
  2. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ మహేష్‌ 


ఓర్వకల్లు, జూలై 25: రాతి వనాల మధ్యలో ఉన్న లింగమయ్య చెరువులో ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కర్నూలు నగరానికి చెందిన సయ్యద్‌ అసద్‌ ఉసామా,సయ్యద్‌ అమీరుద్దీన్‌, దస్తగిర్‌ జాకీర్‌ అహ్మద్‌, సయ్యద్‌ మహమ్మద్‌ అఖిల్‌ బక్రీద్‌ సందర్భంగా ఓర్వకల్లు వద్ద రాతి వనాలకు వెళ్లారు. సరదాగా ఆ ప్రాంతాన్నంతా తిలకించారు. సెల్ఫీలు దిగారు. అనంతరం ఈత కొట్టేందుకు లింగమయ్య చెరువులోకి దిగారు. కొద్దిసేపటికి కర్నూలులోని బాలాజీ నగర్‌కు చెందిన సయ్యద్‌ అసద్‌ ఉసామా (30), నరసింహారెడ్డి నగర్‌కు చెందిన సయ్యద్‌ అమీరుద్దిన్‌ (25) నీటిలో మునిగి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఇద్దరు స్నేహితులు గమనించి పరుగెత్తికెళ్లి రాతివనాల్లో ఉన్న ప్రజలకు తెలియజేశారు. ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని నీటిలో ఉన్న మృతదేహాలను గుర్తించారు. ఓర్వకల్లుకు చెందిన రాజన్న చెరువులోకి దిగి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని కర్నూలు డీఎస్పీ మహేష్‌, రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి పరిశీలించారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సయ్యద్‌ అసద్‌ ఉసామాకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.

Updated Date - 2021-07-26T05:15:56+05:30 IST