రూ.219 కోట్ల పనులకు.. రెండంటే రెండే టెండర్లు!

ABN , First Publish Date - 2020-09-16T15:58:17+05:30 IST

సాధారణంగా ఏ శాఖలోనైనా రూ.10-15 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనులకు..

రూ.219 కోట్ల పనులకు.. రెండంటే రెండే టెండర్లు!

అందులోను ఒకటి అసలు.. మరొకటి డమ్మీ

ఆర్‌ అండ్‌ బీలో అంతా మాయ

నెల్లూరుకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌ సంస్థకు పనులు దక్కే అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఏ శాఖలోనైనా రూ.10-15 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనులకు టెండర్లు పిలిస్తే పదుల సంఖ్యలోనే పోటీపడుతుంటారు. అదే జిల్లా మొత్తం ఒకే ప్యాకేజీగా అయితే...ఇక చెప్పనవసరం లేదు. కానీ, ఆర్‌అండ్‌బీ (రోడ్లు, భవనాల శాఖ)లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. జిల్లాలో బ్రిడ్జిలు, రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.219 కోట్లతో టెండర్లను ఆహ్వానించగా..కేవలం రెండంటే రెండే టెండర్లు దాఖలయ్యాయి. అందులో ఒకటి అసలు కాగా..మరొకటి బినామీగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీలో ఈ పనులను ఒక ప్రముఖ నేతకు చెందిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు ముందు నుంచి వ్యూహ రచన చేశారని, అందుకు అనుగుణంగానే టెండరింగ్‌ ప్రక్రియ సాగుతోందని తెలిసింది. రెండు టెండర్లు పడినప్పటికీ..నెల్లూరుకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌కు చెందిన సంస్థకు జిల్లా పనుల కాంట్రాక్టు దక్కే అవకాశముందని తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ముఖ్య నేత చక్రం తిప్పారని తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిబంధనలతో జిల్లా ప్యాకేజీగా ఒక్కరికే పనులు కట్టబెట్టడంపై మిగిలిన కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్ల పొట్ట కొట్టే పనిగానే దీన్ని భావించాలని వారు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-09-16T15:58:17+05:30 IST