జీహెచ్ఎంసీలో ఇద్దరి సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-06-18T13:58:35+05:30 IST
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు జీహెచ్ఎంసీ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సహేతుక వివరణ ఇవ్వాలంటూ మరో ఇద్దరికి మెమోలు జారీ అయ్యాయి
మరో ఇద్దరికి మెమోలు
విధి నిర్వహణలో నిర్లక్ష్యమే కారణం
హైదరాబాద్ సిటీ: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు జీహెచ్ఎంసీ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సహేతుక వివరణ ఇవ్వాలంటూ మరో ఇద్దరికి మెమోలు జారీ అయ్యాయి. వర్షాకాలం మొదలైనా అధ్వానంగా ఉన్న రహదారులను పట్టించుకోనందుకు వీరిపై చర్యలు తీసుకుంటున్నట్టు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ జోన్ పరిధి కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటెనెన్స్(సీఆర్ఎంపీ) పరిధిలో ఉన్న పద్మారావునగర్ ప్రధాన రహదారిపై వరద నీటి పైపులైన్పై మ్యాన్హోల్ మూత లేదు. ఈ విషయం తన దృష్టికి రావడంతో మంత్రి కే తారక రామారావు వెంటనే స్పందించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ జీహెచ్ఎంసీ అధికారుల తో విచారణ చేయించారు. నివేదిక ఆధారంగా స్థానిక అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) ఎం. రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ మహ్మద్ యూసు్ఫలను సస్పెండ్ చేస్తున్నట్టు అర్వింద్కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులపై చర్యలు తీసుకున్నట్టు జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. బేగంపేట సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ శివానంద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీఎ్సఆర్ ఆంజనేయులకు మెమోలు జారీ చేశారు. ‘ఎందుకీ పరిస్థితి ఉంది, మీరంతా ఏం చేస్తున్నారో..’ వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. వివరణ సరిగా లేని పక్షంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఆర్ఎంపీ పరిధిలో ఉన్న ఆ మార్గంలో నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు రూ.లక్ష జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రధాన రహదారిపై గుంతలున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా పరిగణించినట్టు అధికారులు చెప్పారు.