రైట్...రైట్
ABN , First Publish Date - 2020-06-01T09:31:00+05:30 IST
ఇంచుమించు 70 రోజుల తర్వాత గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణీకులతో తొలిరైలు సోమవారం
నేటి నుంచి గుంటూరు నుంచి రెండు ప్రత్యే రైళ్లు
రైల్వేస్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
రీజియన్ వ్యాప్తంగా 72 బస్సు సర్వీసులు రోడ్డుపైకి..
ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకొన్న వారికే అవకాశం
గుంటూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): ఇంచుమించు 70 రోజుల తర్వాత గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి ప్రయాణీకులతో తొలిరైలు సోమవారం (నేడు) బయలుదేరనుంది. గుంటూరు - సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్నే స్పెషల్ట్రైన్గా రైల్వే శాఖ మార్పు చేసి పచ్చజెండా ఊపి ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ రైలుకు సెకండ్ సిట్టింగ్, ఏసీ ఛైర్కార్ టిక్కెట్లన్నింటిని ప్ర యాణీకులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్నారు. ఉదయం 6 గం టలకు రైలు బయలుదేరనుండటంతో ప్రయాణీకులను గంట న్నర ముందుగానే గుంటూరు రైల్వేస్టేషన్కు చేరుకోవాల్సిందిగా రైల్వే అధికారులు సూచించారు. గంటన్నర ముందుగానే రైల్వే కాంపౌండ్ గేట్లు మూసేస్తాం అని గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం డి.నరేంద్ర వర్మ తెలిపారు.
ప్రయాణికులకు సూచనలు ఇవీ..
- ఉదయం 6 గంటలకు గోల్కొండ రైలులో టిక్కెట్లు బుకింగ్ చేసుకొన్న వారంతా వేకువజామున 4.30 గంటలకు రైల్వేస్టేషన్కు వచ్చేయాలి.
- ప్రయాణికులను రైల్వేస్టేషన్ ప్రాంగణంలో విడిచిపెట్టి వెం ట వచ్చినవారు వెళ్లిపోవాలి. ప్రయాణికులు మూడు క్యూ లైన్లలో భౌతికదూరం పాటిస్తూ ఏర్పాటు చేసిన వృత్తాకారాల్లో ప్రయాణికులు నిల్చోవాలి. అక్కడే టిక్కెట్ తనిఖీ చేస్తారు.
- అనంతరం శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకోవాలి. మాస్కు తప్పనిసరిగా ధరిస్తేనే లోపలికి అనుమతిస్తారు.
- ప్రతీ ఒక్క ప్రయాణీకుడిని థర్మల్ స్ర్కీనింగ్ చేసేందుకు ప్రత్యేకంగా మూడు యంత్రాలు తెప్పించారు.
- పెదకాకాని, నంబూరు, రామన్నపేట వంటి చిన్న రైల్వేస్టేషన్లలో ప్రయాణీకులు ఎవ్వరూ అనధికారికంగా రైళ్లలోకి ఎక్కకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు నియంత్రిస్తారు. ఎవరి ఆహారం వారు వెంట తెచ్చుకోవడం మంచిది.