ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉగ్రవాద దాడి... ఇద్దరు సైనికుల మృతి...

ABN , First Publish Date - 2021-11-28T22:47:50+05:30 IST

పాకిస్థాన్‌లోని కల్లోలిత ప్రాంతం ఉత్తర వజీరిస్థాన్‌లో ఉన్న ఓ భద్రతా

ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉగ్రవాద దాడి... ఇద్దరు సైనికుల మృతి...

పెషావర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత ప్రాంతం ఉత్తర వజీరిస్థాన్‌లో ఉన్న ఓ భద్రతా చెక్ పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఈ చెక్‌ పోస్టులోని సైనికులు వెంటనే అప్రమత్తమై ప్రతిస్పందించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. 


పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం తెలిపిన వివరాల ప్రకారం, ఖైబర్ పక్తూన్‌ఖ్వా ప్రావిన్సులోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లా, దత్త ఖేల్ తహశీల్‌లో శనివారం ఈ ఉగ్రవాద దాడి జరిగింది. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు పారిపోయారు. ఈ సంఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తమ పనేనని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. 


పాకిస్థాన్ ప్రభుత్వం, నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహరీక్-ఈ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఓ నెలపాటు కాల్పుల విరమణ అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం నవంబరు 9 నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ, ఇప్పటికి మూడుసార్లు భద్రతా దళాలపై కాల్పులు జరిగాయి. ఇంతకుముందు బజౌర్ జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు పోలీసులు, టంక్ జిల్లాలో జరిగిన దాడిలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-11-28T22:47:50+05:30 IST