ఈతకు వెళ్లి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి
ABN , First Publish Date - 2021-10-20T08:45:51+05:30 IST
ఈతకు వెళ్లి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతి
కర్ణాటకలో ప్రమాదం.. రంగారెడ్డి వాసులుగా గుర్తింపు
బళ్లారి, అక్టోబరు 19 : విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. పండుగ సెలవుల్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు నీట మునిగి మృతి చెందారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిఽధిలోని సంగాపూర్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మృతి చెందిన వారిని రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. దసరా సెలవులు రావడంతో హైదరాబాద్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విజయనగరం జిల్లా పరిధిలోని హంపి, కొప్పళ జిల్లా పరిధిలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చారు. శనివారం కొప్పళ జిల్లా గంగావతి తాలూకా పరిధిలోని సంగాపుర్ గ్రామానికి చేరుకుని ఓ రిసార్ట్లో బస చేశారు. సోమవారం తెల్లవారుజామున వారంతా సమీపంలో ఉన్న చెరువులో ఈత కొట్టారు. అందులో ఇద్దరు నీటిలో నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో మిగిలిన ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గల్లంతైన వారి కోసం వెతికారు. మృతి చెందిన వారిని మధుకిరణ్ (25), రాజేష్ కుమార్(26)గా గుర్తించారు. నరసింహ, అలోక్ కుమార్ ప్రాణాలతో బయట పడ్డారు.