పట్టాలపైనే..తెల్లారిన బతుకులు
ABN , First Publish Date - 2021-05-08T06:09:01+05:30 IST
పట్టాలపైనే..తెల్లారిన బతుకులు
రైలు ఢీకొని ఇద్దరు రైల్వే ఉద్యోగుల మృతి
ట్రాక్పై పనులు చేస్తుండగా ప్రమాదం
మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన
మహబూబాబాద్ రూరల్, మే 7 : మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారులో శుక్రవారం రైల్వేట్రాక్పై విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు రైలు ఢీకొని మృతి చెందారు. డోర్నకల్ రైల్వే హెడ్కానిస్టేబుల్ సత్యనారా యణరెడ్డి వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం పాతరెడ్యాల గ్రామానికి చెందిన వేంపల్లి వెంకటాచారి-సావిత్రమ్మ దంపతుల రెండో కుమారుడు క మలాకరాచారి (32) ట్రాక్మన్గా, మహబూబాబాద్ పట్టణం రైల్వే క్వార్టర్స్లో నివాసముంటున్న దస్త గిరి-కాసిమున్నీసాబేగంల కుమా రుడు ఎండి.యాకూబ్పాషా(40) కలాసి (పెయింటర్)గా రైల్వేశాఖ లో పనిచేస్తున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపం ఆప్లైన్లో 434/15 మైలు రాయి వద్ద వీరిద్దరు విధుల్లో నిమగ్నమై ఉండగా విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. మూలమలుపువద్ద పనిచేస్తున్న వీరు రైలు రాకను పసిగట్టలేకపోవడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని డోర్నకల్ రైల్వే హెడ్కానిస్టేబుల్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. యాకూబ్పాషాకు భార్య అప్సర, కుమార్తె ఉన్నారు. కమలాకరాచారికి ఏడాది క్రితమే వివాహమైంది.