Bizarre: న్యాయవాదిని కరిచిన రెండు పెంపుడు శునకాలకు 'మరణ శిక్ష'..!
ABN , First Publish Date - 2021-07-14T00:28:53+05:30 IST
మనుషులపై శునకాలు దాడి చేయడం అనేది సాధారణ విషయమే. దాడిలో మనుషులు గాయపడడం కూడా సర్వసాధరణమే. అంతమాత్రాన కరిచిన కుక్కులకు మరణ శిక్ష విధిస్తారా?
కరాచీ: మనుషులపై శునకాలు దాడి చేయడం అనేది సాధారణ విషయమే. దాడిలో మనుషులు గాయపడడం కూడా సర్వసాధరణమే. అంతమాత్రాన కరిచిన కుక్కులకు మరణ శిక్ష విధిస్తారా? అంటే.. సాధారణంగా వచ్చే సమాధానం కాదు అని మాత్రమే. కానీ, పాకిస్తాన్లో ఓ న్యాయవాదిని కరిచిన రెండు పెంపుడు శునకాలు ఇప్పుడు 'మరణ శిక్ష'ను ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు న్యాయస్థానం పర్యవేక్షణలో శునకాల యజమాని, బాధితుడి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. మార్నింగ్ వాక్ కోసం బయటకు వచ్చిన కరాచీకి చెందిన సీనియర్ న్యాయవాది మీర్జా అఖ్తర్పై అదే ప్రాంతానికి చెందిన రెండు పెంపుడు జర్మన్ షెపార్డ్ శునకాలు ఆయనపై దాడి చేశాయి. ఒక్కసారిగా ఆయనపై పడి బాగా కరిచేశాయి. ఈ దాడిలో న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో ఆ శునకాలను పెంచుకుంటున్న హుమాయున్ ఖాన్పై నెటిజన్లు మండిపడ్డారు.
క్రూరమైన శునకాలను సరియైన శిక్షణ ఇవ్వకుండా ఇలా ఇళ్ల మధ్య ఉంచుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇక అక్తర్ న్యాయవాది కావడంతో ఈ విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో చివరికి కుక్కల యాజమాని హుమయూన్ రాజీకి వచ్చాడు. మీర్జా- హుమాయున్ మధ్య కోర్టుబయట కుదిరిన ఒప్పందంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ, మీర్జా అఖ్తర్ రాజీకి అంగీకరిస్తూనే హుమయూన్కు షరతులు విధించారు.
మీర్జా షరతుల్లో మొదటిది ఆయనకు క్షమాపణ చెప్పడం. రెండోది ఆ రెండు శునకాలకు పశువైద్యుల సమక్షంలో విషపూరిత ఇంజక్షన్లతో చంపించాలి. అంటే.. వాటికి మరణ శిక్ష విధించాలి. అలాగే ఆయన దగ్గర వేరే పెంపుడు కుక్కలు ఉంటే వెంటనే వాటిని ఇతరులకు ఇచ్చేయాలి. ఇక కోర్టు బయట మీర్జా-హుమయూన్ మధ్య కుదిరిన శునకాలకు మరణ శిక్ష విధించడమనే ఒప్పందంపై జంతుప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇది ఎంతమాత్రం సమంజసం కాదని మండిపడుతున్నారు.