రెండు బైక్‌ల ఢీ: ఇద్దరి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-27T04:57:51+05:30 IST

రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లి వద్ద జరిగింది.

రెండు బైక్‌ల ఢీ: ఇద్దరి దుర్మరణం
గాయపడ్డ భార్గవ్‌, కౌశిక్‌ ( మృతికి ముందు)

మృతుల్లో 9వ తరగతి విద్యార్థి

వెంకటగిరి(టౌన్‌), జనవరి 26 : రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వాంపల్లి వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు ఏర్పేడు మండలం బండివాని పల్లికి చెందిన నాగరాజు(35) వెంకటగిరిలో పని ముగించుకుని బైక్‌పై తన స్వగ్రామానికి వెళ్తున్నాడు. వాంపల్లి నుంచి వెంకటగిరికి బైక్‌పై వస్తున్న కౌశిక్‌(15), భార్గవ్‌, విష్ణులు నాగరాజు బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగరాజు, కౌశిక్‌ అక్కడికక్కడే మృతి చెందారు. విష్ణుకు స్వల్ప,  భార్గవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భార్గవ్‌ను చికిత్స నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. భార్గవ్‌ కోమాలో ఉన్నారని బంధువులు సమాచారం అందించారు. కౌశిక్‌, భార్గవ్‌, విష్ణులు వెంకటగిరిలోని మోడల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

108  ఆలస్యంగా రావడంతోనే..

108 వాహనం సమాయానికి రాకపోవడం వల్ల  నాగరాజు (35), కౌశిక్‌(15), మృతి చెందారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరు 30నిమిషాల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టారన్నారు. 108కు 10.40 నిమిషాలకు ఫోన్‌ చేస్తే 12.30గంటలకు వచ్చిందన్నారు. అప్పటికే వారు మృత్యువాతపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఫోన్‌ చేస్తే జాతీయ రహదారి 565 అంబులెన్స్‌ కూడా  స్పందించలేదన్నారు.

Updated Date - 2021-01-27T04:57:51+05:30 IST