జిల్లాలో మరో రెండు కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-05T10:08:05+05:30 IST
జిల్లాలో గురువారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. గరుగుబిల్లి మండలంలోని ఓ గ్రామంలో ఒకరికి...
రింగురోడ్డు/ గరుగుబిల్లి, జూన్ 4: జిల్లాలో గురువారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. గరుగుబిల్లి మండలంలోని ఓ గ్రామంలో ఒకరికి... విజయనగరం అయ్యన్నపేట క్వారంటైన్ సెంటర్లో ఉన్న వలస కూలీకి కరోనా లక్షణాలు కనిపించాయి. వీరికి మొదట ట్రూనాట్ పరీక్షలు నిర్వహించారు పాజిటివ్ రావడంతో స్వాబ్ను తీసి వైరస్ నిర్ధారణ పరీక్షలకు పంపించారు. గురువారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్గా తేలింది. వీరిని నెల్లిమర్ల మిమ్స్ కొవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజా కేసులతో ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 43కు చేరింది. గరుగుబిల్లి మండలానికి చెందిన వ్యక్తి చెన్నయ్లో కూలీగా పనిచేశాడు.
ఆయన అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరితో ఇటీవల విజయవాడ నుంచి విశాఖపట్టణానికి బస్సులో ప్రయాణం చేశాడు. అనంతరం విశాఖ నుంచి పార్వతీపురం బుధవారం చేరుకున్నారు. నేరుగా పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకుని గ్రామానికి వెళ్లిపోయారు. పరీక్షల అనంతరం ఒకరికి పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. గ్రామానికి గురువారం చేరుకుని కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరి నుంచి కూడా శాంపిళ్లను సేకరించామని డాక్టర్ కె.అరుణకుమారి తెలిపారు. పాజిటివ్ ఉన్న వ్యక్తి ఇంటికే పరిమితమయ్యాడని, ముందుజాగ్రత్తగా 30 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.