సీసీ కెమెరా ముందుకొచ్చి మరీ ఇద్దరు దొంగల అనూహ్య ప్రవర్తన.. అర్ధరాత్రి షాపులోకి దూరి చోరీ చేసి..

ABN , First Publish Date - 2021-09-07T02:12:23+05:30 IST

అనుకున్నట్టుగానే అంతా జరిగిపోయింది.. ఊహించిన దానికంటే బాగానే చేతికి ముట్టింది. దీంతో...వారిలో ఆనందం హద్దులు దాటింది. ఎవరికైనా పట్టుబడితే ప్రమాదం అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు.

సీసీ కెమెరా ముందుకొచ్చి మరీ ఇద్దరు దొంగల అనూహ్య ప్రవర్తన.. అర్ధరాత్రి షాపులోకి దూరి చోరీ చేసి..

ఇంటర్నెట్ డెస్క్: అనుకున్నట్టుగానే అంతా జరిగిపోయింది.. ఊహించిన దానికంటే బాగానే చేతికి ముట్టింది.  దీంతో...వారిలో ఆనందం హద్దులు దాటింది. ఎవరికైనా పట్టుబడితే ప్రమాదం అన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. సంబరంలో తెగ డ్యాన్సులు చేశారు. దిగ్విజయంగా దొంగతనం చేసిన ఇద్దరు దొంగల అసాధారణ వ్యవహార శైలి ఇది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్ జిల్లాలో ఖేరవాడా అనే చిన్న టౌన్‌ ఉంది. ఆ ప్రాంతంలోని ఓ కిరాణా షాపులో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. ముఖం కనబడకుండా రుమాలు అడ్డం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు కిటికీ చువ్వలు తొలగించి షాపులోకి ప్రవేశించారు. అక్కడ కాజూ, పిస్తా, బాదాం వంటి వస్తువులను పెద్ద పెద్ద సంచుల్లో సర్దేశారు. అంతేకాకుండా.. గల్లా పెట్టే విరగొట్టి అందులో దొరికిన వేల రూపాయల నగదును కూడా కాజేశారు. వీటి మొత్తం విలువ లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. 


మరి.. ఓ సాధారణ కిరాణా షాపులో ఇంత పెద్ద మొత్తం దొరుకుతుందని వారు ఊహించలేదేమో కానీ  వారు పారిపోయే ముందు షాపులోనే మజా చేసుకున్నారు. గాల్లో చేతులు ఊపుతూ.. ఎగురుతూ.. దూకుతూ తెగ డ్యాన్సులు చేసేశారు. మరుసటి రోజు యజమాని వచ్చి చూస్తే..షాపులోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం కనిపించింది. అంతేకాకుండా.. కిటికీ చువ్వలు కూడా తొలగించి ఉన్నట్టు గుర్తించిన ఆయన ..పోలీసులకు సమాచారం అందించారు.


అయితే.. గతంలోనూ ఆ షాపులో చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఇక ఇటువంటి ఘటనలు పునరావృతంగా కాకుండా ఉండేందుకు రాత్రిళ్లు పోలీసు గస్తీ మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. 


Updated Date - 2021-09-07T02:12:23+05:30 IST