చేయని నేరానికి 31 ఏళ్ల జైలు.. పరిహారంగా రూ.550కోట్లు!
ABN , First Publish Date - 2021-05-16T22:18:39+05:30 IST
అమెరికాలోని నార్త్ కరోలినాలో ఫెడరల్ సివిల్ రైట్స్ కేసులో ఇద్దరు నల్ల జాతీయులకు అక్కడి జ్యూరీ 75 మిలియన్ డాలర్లు(సుమారు రూ.550కోట్లు) పరిహారంగా ఇచ్చింది.
నార్త్ కరోలినా: అమెరికాలోని నార్త్ కరోలినాలో ఫెడరల్ సివిల్ రైట్స్ కేసులో ఇద్దరు నల్ల జాతీయులకు అక్కడి జ్యూరీ 75 మిలియన్ డాలర్లు(సుమారు రూ.550కోట్లు) పరిహారంగా ఇచ్చింది. చేయని నేరానికి 31 ఏళ్లు జైలులో ఉన్న ఆ ఇద్దరికి ఇలా భారీ మొత్తంలో నష్టపరిహారం దక్కింది. అసలేం జరిగిందంటే.. 1983లో హెన్రీ మెక్కాలమ్, లియోన్ బ్రౌన్ అనే ఇద్దరు నల్ల జాతీయులు ఓ 11 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో జైలుకు వెళ్లారు. ఇలా వారు మూడు దశాబ్దాల పాటు జైలులోనే ఉండిపోయారు. ఈ క్రమంలో 2014లో డీఎన్ఏ టెస్టు ద్వారా ఆ ఇద్దరు తప్పుగా అరెస్ట్ చేయబడ్డారని తెలిసింది. అసలు నిందితులు తప్పించుకున్నట్లు తెలియడంతో అదే ఏడాది మెక్కాలమ్, లియోన్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 2015లో వారు పౌరు హక్కుల కేసు పెట్టారు. శుక్రవారం ఈ కేసుపై జ్యూరీ తీర్పును వెల్లడించింది. చేయని నేరానికి 31 ఏళ్లు జైలు జీవితం గడిపినందుకు ఏడాదికి ఒక మిలియన్ చొప్పున ఇద్దరికి చెరో 31 మిలియన్ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే శిక్షాత్మక నష్టపరిహాంగా మరో 13 మిలియన్లు కూడా ఇచ్చింది. దీంతో మెక్కాలమ్, లియోన్కు పరిహారంగా మొత్తం 75 మిలియన్ డాలర్లు(సుమారు రూ.550కోట్లు) దక్కాయి.