లాఠీ భయంతో ఆగిన గుండెలు
ABN , First Publish Date - 2020-04-04T07:40:29+05:30 IST
కరోనా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తున్నవారు పోలీసుల భయంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పశ్చిమ గోదావరిజిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు వస్తున్నారనే భయంతో...
- పోలీసులు వస్తున్నారని పరుగెడుతూ
- పశ్చిమలో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి
పాలకొల్లు/గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 3: కరోనా లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తున్నవారు పోలీసుల భయంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పశ్చిమ గోదావరిజిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు వస్తున్నారనే భయంతో పరుగెడుతూ శుక్రవారం ఇద్దరు వ్యక్తులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పాలకొల్లులోని ఎల్ఆర్ పేటలో ఉదయం 8-30 గంటలకు టిఫిన్ దుకాణం తెరచి ఉందన్న సమాచారంతో పోలీసులు సైరన్ మోగించుకుంటూ అటుగా వచ్చారు. పోలీసులు రావడం చూసి, టిఫిన్ చేస్తున్నవారు పరుగెత్తారు. యాండ్ర రామాంజనేయలు(57) సమీ పంలోని కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలోకి పరుగెత్తి మెట్ల వద్ద ఆయాసంతో కింద కూర్చున్నారు. కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో మృతి చెందారు. మరోఘటనలో కరోనా కర్ఫ్యూలో భాగంగా చింతలపూడి మండలం వెంకటాపురానికి పోలీసులు వెళ్లారు. రామాలయం వద్ద కూర్చున్న రైతులు పరుగుదీయగా పసుపులేటి భాస్కరరావు(55) ఒక ఇంట్లోకివెళ్లి స్పృహ తప్పి పడిపోయారు. చింతలపూడి ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.
విజయనగరంలో వినూత్న దండన
దుకాణాలు తెరిచిన వ్యాపారులతో విజయనగరంలో మొదటి హెచ్చరికగా కరోనా నిబంధనలు తెలిపే ప్లకార్డులు పోలీసులు పట్టించారు.