ఇద్దరు మల్లన్న ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-08-03T19:39:44+05:30 IST
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ మొక్కుబడి కోడెల విక్రయయత్నం ఘటనలో ఇద్దరు ఆలయ ఉద్యోగులు మ్యాకల పోచయ్య, వెంకటాచారిపై వేటుపడింది. ఈమేరకు ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్
చేర్యాల(మెదక్): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ మొక్కుబడి కోడెల విక్రయయత్నం ఘటనలో ఇద్దరు ఆలయ ఉద్యోగులు మ్యాకల పోచయ్య, వెంకటాచారిపై వేటుపడింది. ఈమేరకు ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ వారిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం కోడెల విక్రయయత్నానికి పాల్పడిన తాత్కాలిక సిబ్బంది సానాది నరేశ్ పట్టుబడగా, పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. అయితే విచారణలో గుర్తించిన అంశాలను పొందుపరుస్తూ పోలీసులు తగు సూచనలు చేశారు. దీంతో గతంలో సంబంధిత శానిటేషన్ విభాగంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ మ్యాకల పోచయ్య, రికార్డు అసిస్టెంట్ వెంకటాచారిని సస్పెండ్ చేశారు. మొక్కుబడి కోడెలు, గొర్రెల విషయంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు కారణమైనందున విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఈవో వెంకటేశ్ తెలిపారు.
కొమురవెల్లిలో భక్తుల రద్దీ
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. శ్రావణమాసం కావడంతో మల్లన్న దర్శనం కోసం పొరుగు జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రాజగోపుర ఆవరణలో నుంచి కాకుండా క్యూలైన్లో ఏర్పాటుచేసిన శానిటైజేషన్ టన్నెల్ ద్వారా భక్తులను లోపలికి అనుమతించారు. భక్తులకు లడ్డూ, పులిహోర ప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు.