Hyderabadలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్.. ఏం జరిగిందో..!
ABN , First Publish Date - 2021-12-10T11:47:47+05:30 IST
ఎత్తు 4 అడుగులు ఉంటుందని, తెలుగు, ఇంగ్లీషు మాట్లాడుతుందని, ఇంటి నుంచి వెళ్లే...
హైదరాబాద్ సిటీ/బాలానగర్ : నగరంలోని బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గౌతమీనగర్లో నివాసముంటున్న జెల్ల జాహ్నవి (16) కనిపించకుండాపోయింది. ఈమె ఓ ప్రైవేటు కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన జాహ్నవి తల్లి సునీత... బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాహ్నవి ఎత్తు 4 అడుగులు ఉంటుందని, తెలుగు, ఇంగ్లీషు మాట్లాడుతుందని, ఇంటి నుంచి వెళ్లే సమయంలో పసుపురంగు టీ షర్టు, మెరూన్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించిందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్టు బాలానగర్ సీఐ ఎం.డి వహీదుద్దీన్ తెలిపారు. సునీతను గుర్తుపట్టిన వారు 040-27854001/9490617114 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
భాగ్యలక్ష్మీకాలనీలో విద్యార్థిని..
కళాశాలకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన విద్యార్థిని తిరిగి రాలేదు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని భాగ్యలక్ష్మీకాలనీకి చెందిన శ్రీనివాస్, నాగసత్యవేణి దంపతుల కుమార్తె నాగరేవతి (20) చింతల్లోని బాగ్యరథీ కళాశాలలో చదువుతోంది. ఈనెల 8న ఉదయం 11 గంటలకు సుచిత్రలోని రిలయన్స్ ట్రెండ్స్ వద్ద స్నేహితురాలిని కలిసి కళాశాలకు వెళతానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బంధువులు, తెలిసినవారు, స్నేహితులను ఆరాతీసినా ఫలితం కనిపించకపోవడంతో గురువారం నాగరేవతి తండ్రి శ్రీనివాస్ పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరాణా షాపులో పనిచేస్తున్న సాయిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.