వైద్యం కోసం వెళ్తుంటే విషాదం!
ABN , First Publish Date - 2021-06-20T08:53:21+05:30 IST
అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైద్యం కోసం చేస్తున్న ప్రయాణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
టైర్ పగిలి ఇన్నోవా-కారు ఢీ
కుటుంబంలో నలుగురి దుర్మరణం
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
వ్యాన్ కల్వర్టును ఢీకొని ఇద్దరి మృతి
మరో 13 మంది కూలీలకు గాయాలు
వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఘటనలు
కొడంగల్, ఇచ్చోడ రూరల్, జూన్ 19: అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైద్యం కోసం చేస్తున్న ప్రయాణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని బీజాపూర్-హైదరాబాద్ రహదారిపై శనివారం ఉదయం జరిగింది.
బాధితులు, పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్లోని యూసు్ఫగూడకు చెందిన మౌలాన్బీ (58), బాబుమియా (39)లు తమ కుమారులు మహ్మద్ అబ్దుల్ (35), మహ్మద్ రషీద్ (27), మహ్మద్ అబ్దుల్ అమీర్(22)లతో కలిసి శనివారం ఉదయం కర్ణాటకలోని యాద్గిర్కు ఇన్నోవా వాహనం (ఏపీ 12 జీ 7786)లో బయలుదేరారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ శివారులోని బీజాపూర్-హైదరాబాద్ రహదారిపై ఇన్నోవా వాహనం టైర్ పగిలిపోయింది. దీంతో అదుపు తప్పిన ఈ వాహనం.. కర్ణాటకలోని గుల్బర్గ నుంచి హైదరాబాద్కు వస్తున్న కారు ( కేఏ 32 పీ 6777) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ఉన్న మౌలాన్బీ, బాబు మియా, మహ్మద్ అబ్దుల్, మహ్మద్ రషీద్లు అక్కడికక్కడే మృతి చెందగా, మహ్మద్ అబ్దుల్ అమీర్ తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక నుంచి వస్తున్న కారులో ఉన్న మహ్మద్ అమీర్ (30), డ్రైవర్ మహ్మద్ అస్లాంకుతీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.
అతివేగంతో అదుపు తప్పి..
కూలీ పనుల కోసం వెళ్తుండగా.. టవేరా వ్యాన్ కల్వర్టును ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఇస్లామ్నగర్ గ్రామ శివారులో జరిగింది. మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ర్టాలకు చెందిన 16 మంది కూలీలు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి టవేరా వాహనంలో శుక్రవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. అతివేగంతో దూసుకెళ్తున్న వాహనం ఇస్లామ్నగర్ గ్రామ శివారులో అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో అందులో ఉన్న చత్తీస్ఘడ్లోని నిలేది గ్రామానికి చెందిన పంజారి రాహుల్(16), మధ్యప్రదేశ్ లోని బెల్వా గ్రామానికి చెందిన రాం నరేష్ శుక్లా(41)లు మృతి చెందారు. మరో 13మందికి స్వల్ప గాయాలయ్యాయి.