ఉన్నత చదువుల కోసం Canada వెళ్లిన ఇద్దరు భారత యువతులు.. నెలన్నరకే విషాద ఘటన!
ABN , First Publish Date - 2021-10-18T15:13:23+05:30 IST
కెనడాలోని బ్రాంప్టన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఇద్దరు భారతీయ యువతులు ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయడపడ్డారు. నలుగురు కారులో వెళ్తున్న సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
బ్రాంప్టన్: కెనడాలోని బ్రాంప్టన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఇద్దరు భారతీయ యువతులు ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయడపడ్డారు. నలుగురు కారులో వెళ్తున్న సమయంలో రైల్వే క్రాసింగ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ముక్తసర్లోని రాణివాలా గ్రామానికి జసన్ప్రీత్ కౌర్(18), ఫరీద్కోట్లోని దీప్ సింఘ్వాలా నివాసి ప్రభ్దీప్ కౌర్(24)గా గుర్తించారు. జసన్ప్రీత్ కౌర్ సోదరి పాలంప్రీత్ కౌర్(21), పాటియాలకు చెందిన కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
జసన్ప్రీత్ కౌర్ ఉన్నత చదువుల కోసం కేవలం నెలన్నర రోజుల ముందే కెనడా వెళ్లింది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ ముగ్గురు చదువుకుంటునే పార్ట్టైంగా ఓ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కూడా విధులకు వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ను సరిగ్గా గమనించకపోవడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అక్కడి లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మృతుల బంధువు అయిన గురుప్రతాప్ సింగ్ తెలిపారు.
45 రోజుల కింద కెనడా వెళ్లిన తమ కూతురు ఇలా రోడ్డు ప్రమాదంలో తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయిందంటే నమ్మలేకపోతున్నామని జసన్ప్రీత్ కౌర్ తండ్రి రాజ్వీందర్ సింగ్ అన్నారు. శనివారం రాత్రి కూడా తన కూతురు తమతో మాట్లాడిందని, ఆ తర్వాతి రోజే ఈ ఘోరం జరిగిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఒకగానొక కూతురు ఇలా అర్ధాంతరంగా తమను వదిలి వెళ్లిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన బోరున విలపించారు. సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత, కెనడా ప్రభుత్వాలు సహకరించాలని రాజ్వీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.