కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు.. రెండు వర్గాల పరస్పర దాడులు..!
ABN , First Publish Date - 2020-08-10T14:53:38+05:30 IST
వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు ఘర్షణకు పడ్డారు. ఆదివారం జరిగిన యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇరు వర్గాల నాయకులు, అనుచరులు పరస్పర దాడులకు దిగారు. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్
యూత్ కాంగ్రెస్ నేతలు రమాకాంత్రెడ్డి, తోట పవన్ వర్గాల పరస్పర దాడులు
వివాదారికి దారి తీసిన ఆవిర్భావ వేడుకలు
వరంగల్ సిటీ : వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలు ఘర్షణకు పడ్డారు. ఆదివారం జరిగిన యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఇరు వర్గాల నాయకులు, అనుచరులు పరస్పర దాడులకు దిగారు. హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొట్టిముక్కల రమాకాంత్రెడ్డి. వరంగల్ పశ్చిమ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట పవన్తో పాటు వీరి అనుచరులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ధూషణలు. ముష్టిఘాతాలు, కర్రలతో దాడులకు దిగారు. వాహనాల అద్దాల ధ్వంసం చర్యలతో డీసీసీ భవన్ ప్రాంగణం రణరంగంగా మారింది. మరోవైపు ఈ వివాదం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ల మధ్య రాజుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వారు కొట్టిపారేశారు. విభేదాలు లేవని స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న వైరం వల్లే ఘర్షణ జరిగినట్లుగా వెల్లడించారు. మొత్తంగా ఈపరిణామం కాంగ్రెస్లో విభేదాలను బహిర్గం చేసింది.
వివాదానికి కారణమైన ఆవిర్భావ వేడుకలు
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వివాదానికి కారణమయ్యాయి. అంతకు ముందు నుంచే రమాకాంత్రెడ్డి, తోట పవన్ల మధ్య వైరం నెలకొనడం కూడా వివాదాన్ని మరింతగా రగిలించింది. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ సమక్షంలో వేడుకలు జరిగాయి. డీసీసీ భవన్లో యూత్ కాంగ్రెస్ జెండాను నాయిని రాజేందర్రెడ్డి ఆవిష్కరించి వెళ్లిపోయారు. అరుతేఏ కార్యక్రమానికి తోట పవన్ నేతృత్వం వహించడాన్ని రమాకాంత్రెడ్డితో పాటు వర్గీయులు తప్పుపట్టారు. ప్రొటోకాల్కు విరుద్ధంగా తోట పవన్ వ్యవహరించారని, రమాకాంత్రెడ్డి వర్గీయులు భావించారు. అయితే పశ్చిమ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏర్పాట్లు చేశానని తోట పవన్ సమర్ధించుకున్నారు. ఈ విషయంపైనే తోట పవన్, రమాకాంత్రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన చర్చ క్రమంగా ఘర్షణకు దారి తీసింది. పరస్పర దాడులతో డీసీసీ భవన్ ప్రాంగణం రణరంగంగా మారింది. ముష్టిఘాతాలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల రంగం ప్రవేశం చేసి యూత్ కాంగ్రెస్ నేతలు, అనుచరులను హన్మకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విచారణ జరిపిస్తాం : నాయిని రాజేందర్రెడ్డి
జరిగిన ఘటనపై విచారణ జరిపిస్తాం. టీపీసీసీ దృష్టికి వెళ్లింది. నివేదిక కోరింది. సమగ్ర విచారణ జరిపి త్వరలోనే టీపీసీసీకి అందచేస్తా. ఎవరు తప్పు చేసినా చర్యలు ఉంటాయి. పార్టీలో వర్గ విభేదాలు లేవు. ఏ వర్గాన్ని ప్రొత్సహించేది లేదు. అందరు పార్టీ నిబంధనలకు కట్టుబడి పనిచేయాల్సిందే.